రాష్ట్రంలో చట్ట విరుద్ధ పాలన

ABN , First Publish Date - 2022-05-23T06:28:51+05:30 IST

రాష్ట్రంలో చట్ట విరుద్ధ పాలన సాగుతోందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.

రాష్ట్రంలో చట్ట విరుద్ధ పాలన

ఉప్పలగుప్తం, మే 22: రాష్ట్రంలో చట్ట విరుద్ధ పాలన సాగుతోందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు. అనంత ఉదయభాస్కర్‌ను అరెస్టు చెయ్యాలంటూ ఆదివారం అమలాపురంలో ఆందోళన చేస్తున్న ఆనందరావు, టీడీపీ ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల అఽధ్యక్షులు అరిగెల నానాజీ, దెందుకూరి సత్తిబాబురాజులతో పాటు పలువురు నాయకులను పోలీసులు ఉప్పలగుప్తం స్టేషన్‌కు తీసుకువచ్చి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈసందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు అధికారులను దోషులుగా నిలబెడుతోందన్నారు. అనంత ఉదయభాస్కర్‌ విషయంలో పోలీసుల తీరు గమనిస్తే చట్టానికి ఎంత విలువ ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ అండ ఉన్న నేరస్తులను రక్షించేందుకు పోలీసులే ప్రయత్నిస్తే సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా టీడీపీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేసే పోలీసులు ఒక హత్య కేసులో నిందితుడు పట్టపగలు వివాహాలకు హాజరవుతుంటే ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం వెనుక రహస్యాన్ని సామాన్య జనం సైతం అర్ధం చేసుకుని ముక్కు మీద వేలేసుకుంటున్నారని అన్నారు.  



Updated Date - 2022-05-23T06:28:51+05:30 IST