రాష్ట్రం కార్పొరేట్లకు తాకట్టు
ABN , First Publish Date - 2022-08-12T05:55:52+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన నడుస్తున్నాడని, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు.
ప్రధాని బాటలోనే సీఎం జగన
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
గార్లదిన్నె, ఆగస్టు 11: ప్రధాని నరేంద్రమోదీ అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన నడుస్తున్నాడని, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురష్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా గౌరవ యాత్రను గురువారం గార్లదిన్నె మంలం కనుంపల్లిలో ఆయన ప్రారంభించారు. కనుంపల్లి నల్లలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కనుంపల్లి, తిమ్మంటపే, తలగాసిపల్లి మీదుగా గార్లదిన్నె వరకు పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. గార్లదిన్నెలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని కనికరించమని వేడుకోవడం తప్ప, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల గురించి ఆయన వద్ద కాలు దువ్వే ధైర్యం సీఎం జగన లేదని ధ్వజమెత్తారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఒక సెంటు ఇచ్చి, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకోలేని ముఖ్యమంత్రికి ప్యాలెస్ ఎందుకని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ రోజు రూపాయికి, ఉచితంగా బియ్యం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చలువేనని అన్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన బంధువులను మండలానికి ఒకరిని పెట్టుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే బంధువులు ప్రతి మండలానికీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు దాదాగాంధీ, డీసీసీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్పరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోనిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫకృద్దీన, మండల కన్వీనర్ ఓబిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పూలప్రసాద్, నాయకులు పులిరాజు, శర్మా్షవలి, నాగరాజు, ఉప్పర రామాంజినేయులు, ఆదెన్న, ఏకే నరసింహులు, యల్లప్ప, ఓబిలేసు, సుబ్బారెడ్డి, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.