ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

ABN , First Publish Date - 2020-03-19T00:07:10+05:30 IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి..

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది. 


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని రమేశ్ కుమార్ కోరినట్లు లేఖలో ఉంది. 


మరోవైపు ఎన్నికల కమిషనర్ ఈసీకి లేఖ రాయలేదంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. స్వయంగా కమిషనర్ లెటర్ హెడ్‌పై ఆయన సంతకంతో ఈ లేఖ వెలువడటంతో దీనిపై స్పష్టత రావాలంటే రమేశ్ కుమార్ స్వయంగా స్పందించాల్సి ఉంది. 











Updated Date - 2020-03-19T00:07:10+05:30 IST