ట్రై ఏజ్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-17T05:16:32+05:30 IST
ట్రై ఏజ్ సెంటర్ ప్రారంభం
ఎన్టీఆర్ డెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు
పాయకాపురం, ఏప్రిల్ 16 : కరోనాను ఎదుర్కొనేందుకు శుక్రవారం ట్రై ఏజ్ కేంద్రాన్ని ప్రారంభించారు. హోం ఐసోలేషన్లో ఉండే కరోనా బాధితులకు సత్వర చికిత్స అందించటానికి, ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించటానికి, వైద్యులు సలహాలు ఇవ్వటానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. ఎన్టీఆర్ డెంటల్ హాస్పిటల్లోని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ ట్రై ఏజ్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామని, ఫోన్ చేసిన వ్యక్తి లక్షణాలు తెలిపితే సూచనలు, మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకే ట్రై ఏజ్ కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులో ఉంచామన్నారు. హోం ఐసోలేషన్ కోరుకునే వారికి 14 రోజులు మందులు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్, డీఎంహెచ్వో ఎం.సుహాసినీ, డీసీహెచ్ఎస్ ఆర్.జ్యోతిర్మణి, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యుగంధర్ పాల్గొన్నారు. అనంతరం అత్యాధునిక యంత్ర పరికరంతో కలెక్టర్ బీపీ, ఆక్సిజన్ లెవల్స్ పరీక్ష చేయించుకున్నారు.