గీతంలో స్మార్ట్ ఐడియాథాన్ - 2022 ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-11T06:31:18+05:30 IST
జాతీయ స్థాయిలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ), స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఐడియాథాన్-2022 పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.
నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపు
విశాఖపట్నం, ఆగస్టు 10 : జాతీయ స్థాయిలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ), స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఐడియాథాన్-2022 పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ స్టార్టప్లను విజయవంతంగా నడిపేందుకు ఎదురయ్యే సవాళ్లను యువత సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
స్వల్పకాలిక ఇబ్బందులు అధిగమించేలా తమను తాము సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిజాయతీతో జీవితంలో ఎదిగిన వారిని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దయానందసిద్దపట్టం మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఉన్న భారత్, దాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞాన భారతాన్ని ఆవిష్కరించాలన్నారు. శాస్త్ర విజ్ఞానంలో దేశం సాధిస్తున్న విజయాలకు నూతన ఆవిష్కరణల ద్వారా యువత ఊపిరి ఊదాలన్నారు.
పరిశోధనల ఫలితాలు సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించే విధంగా వర్సిటీలో బయోనెస్ట్ నెలకొల్పే ప్రతిపాదన ఉన్నట్లు వెల్లడించారు. ఐడియాధాన్ కన్వీనర్ మహేష్వారియర్ మాట్లాడుతూ 1200 మంది ఔత్సాహికులు దరఖాస్తు చేయగా, 32 బృందాలను సెమీఫైనల్కు ఎంపికచేశామని, 11న ఫైనల్స్లో విజేతను ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ గౌతమ్రావ్, ప్రొఫెసర్ గుణశేఖరన్, ప్రొఫెసర్ రాజా పి.పప్పు పాల్గొన్నారు.