మోదీపై రైతులు యుద్ధం ప్రకటించారు: స్టాలిన్

ABN , First Publish Date - 2020-12-05T20:54:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే అధ్యక్షుడు..

మోదీపై రైతులు యుద్ధం ప్రకటించారు: స్టాలిన్

సేలం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారంనాడు తమిళనాడులోని సేలంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.


'చట్టాలకు వ్యతిరేకంగా మేము కోర్టుకు వెళ్లాం. పంజాబ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. మన ముఖ్యమంత్రి రైతులకే తొలి ప్రాధాన్యం అంటుంటారు. మరి ఆయన ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు?' అని మఖ్యమంత్రిపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ, ప్రధాని మోదీపై రైతులు యుద్ధం ప్రకటించారని చెప్పారు. ప్రధాని తాను కూడా ఓ పేద కుటుంబానికి చెందిన వాడినని, ఒక్క రైతు కూడా మరణించడానికి వీల్లేదని చెబుతుంటారని, వాస్తవం చూస్తే వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. నిజంగానే ప్రధాని పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే వెంటనే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి, రైతు ఆందోళనలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని అన్నారు. ఢిల్లీలో రైతులు జరుపుతున్న పోరాటానికి డీఎంకే మద్దతు కొనసాగిస్తుందని స్టాలిన్ చెప్పారు. వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రస్తావనే లేదని, రైతులు డిమాండ్ చేస్తున్నది కూడా అదేనని స్టాలిన్ అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారని చెప్పారు.


కాగా, కేంద్రం, రైతుల మధ్య శనివారం ఐదో విడత చర్చలు జరుగనున్నాయి. రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేపట్టిన నిరసన శనివారంతో పదో రోజుకు చేరింది. చట్ట సవరణలకు కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాలు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, ఈనెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Updated Date - 2020-12-05T20:54:23+05:30 IST