స్టాలిన్ కుటుంబం ఎక్కడ ఉందో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-04-20T14:32:12+05:30 IST
దిండుగల్ జిల్లా కొడైకెనాల్ సమీపంలో కొండగ్రామాల్లో సోమవారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పర్యటించారు. నాలుగు రోజుల క్రితం స్టాలి
పెరంబూర్(చెన్నై): దిండుగల్ జిల్లా కొడైకెనాల్ సమీపంలో కొండగ్రామాల్లో సోమవారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పర్యటించారు. నాలుగు రోజుల క్రితం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గ, కుమారుడు ఉదయనిధి దంపతులు, కుమార్తె సెందామరై దంపతులు, మనుమడు, మనుమరాళ్లు కలిపి మొత్తం 16 మందితో కొడైకెనాల్ చేరుకొని ఓ ప్రైవేటు హోటల్లో బసచేశారు. మూడు రోజులు హోటల్ నుంచి స్టాలిన్ సహా కుటుంబసభ్యులు బయటకు రాలేదు. అదే సమయంలో రెండు రోజుల క్రితం మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఉదయనిధి సాయంత్రానికి కొడైకెనాల్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం స్టాలిన్ తన కుటుంబంతో కలిసి కొండ గ్రామాలైన మన్నవనూర్, కూక్కాల్కు వెళ్లారు. అక్కడ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గొర్రెలు, కుందేళ్ల పరిశోధన కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కుక్కాల్ ప్రాంతంలోని కొండెక్కారు. నిత్యం తెల్ల చొక్కా, తెల్ల లుంగీలో కనిపించే స్టాలిన్.. ప్యాంటు చొక్కా ధరించి కలర్ఫుల్గా కనిపించడంతో అక్కడివారు ఆయన్ని ఆసక్తిగా తిలకించారు. తమ అభిమాన నేతతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు. ఇదిలా వుండగా స్టాలిన్ కుటుంబం పర్యటన ముగించుకుని మంగళవారం చెన్నై చేరుకోనుంది.