శ్రీశైలవాసుడికి సింహవాహన సేవ
ABN , First Publish Date - 2021-03-08T05:42:23+05:30 IST
నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వరాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ధ్వజారోహణం వేడుకలు వైభవంగా జరిగాయి.
నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 7 : నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వరాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ధ్వజారోహణం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామవారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు జరిగాయి. మూలవర్లకు, ధ్వజస్తంభానికి విశేష పుష్పాలంకరణలు చేశారు. రాత్రికి స్వామివారికి సింహవా హనసేవ కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా మాడిశెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్ని ఆలయ చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కొండూరు గీత, గంగరాజుయాదవ్, బ్రహ్మోనందరావు, పూర్ణచంద్రరావు, విష్ణుప్రియ, యం.రాజే శ్వరమ్మ, వెంకటరమణమ్మ, ఎక్స్ఆఫిషియా మెంబరు వి.శివకుమార్, ఈవో ఎ.వేణుగోపాల్లు పర్యవేక్షించారు. అలాగే నగరంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం సింహవాహన ఉత్సవాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు ఉత్సవాల్ని పర్యవేక్షించారు.
నామినేషన్ల ఖరారు
నెల్లూరు(జడ్పీ); మార్చి 7 : జిల్లాలో జరుగుతున్న పంచాయతీ, వార్డుల ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ఆదివారం పూర్తి అయింది. ఇందులో సర్పంచు స్థానాలకు రెండు నామినేషన్లను తిరస్కరించారు. దీంతో 17 నామినేషన్లు ఖరారయ్యాయి. అలాగే 54 వార్డులకు సంబంధించి 105 నామినేషన్లు దాఖలు కాగా, అన్ని నామినేషన్లు అర్హత పొందాయి. దీంతో నాలుగు పంచాయతీలకు 17 నామినేషన్లు, 54 వార్డులకు 105 నామినేషన్లు ఖరారయ్యాయి.
మహిళల గొప్పతనం... ఎంత చెప్పినా తక్కువే !
ఎస్పీ భాస్కర్భూషణ్
నెల్లూరు(క్రైం) మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో ఆదివారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని సబ్డివిజన్లోని పోలీస్ స్టేషన్లలో పరిధిలో కూడా ర్యాలీలను నిర్వహించారు. నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాలు వద్ద జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఆర్టీసీ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతపై నెల్లూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ర్యాలీలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.