TS News: కృష్ణా బేసిన్లో నిండుకుండల్లా ప్రాజెక్టులు
ABN , First Publish Date - 2022-07-28T01:55:55+05:30 IST
పశ్చిమ కనుమల్లో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లో సాగర్కు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ
నల్గొండ: పశ్చిమ కనుమల్లో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లో సాగర్కు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) పూర్తిస్థాయి నీటి మట్టం 885అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 880 అడుగులుగా ఉంది. బుధవారం సాయంత్రం శ్రీశైలం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31,756 క్యూసెక్కులు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు.సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తం 63,540 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తు తం 550.20 అడుగులకు (210.2186టీఎంసీలకు) చేరుకుంది. మరో 102 టీఎంసీ (TMC)ల నీరు సాగర్కు వచ్చి చేరితే సాగర్ పూర్తి స్థాయికి చేరుకుంటుంది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీ (SLBC) ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి విడుదల లేదు.