పెట్రోలు కొరతపై నిరసనలు... సైన్యాన్ని మోహరించిన శ్రీలంక...

ABN , First Publish Date - 2022-03-23T19:45:07+05:30 IST

శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ కొరత వేధిస్తుండటంతో వాహనదారులు

పెట్రోలు కొరతపై నిరసనలు... సైన్యాన్ని మోహరించిన శ్రీలంక...

కొలంబో : శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ కొరత వేధిస్తుండటంతో వాహనదారులు ధర్నాలకు దిగుతున్నారు. పెట్రోలు బంకుల వద్ద ప్రతి రోజూ వందలాది మంది వాహనదారులు బారులుతీరి ఉంటున్నారు. కోపోద్రిక్తులవుతున్నవారు రోడ్లను దిగ్బంధిస్తున్నారు.  దీంతో ప్రభుత్వం సైన్యాన్ని మోహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. 


శ్రీలంకలో ఆర్థిక ఒడుదొడుకులు తీవ్రమయ్యాయి. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి పరిస్థితి ఎదురవడం ఆ దేశానికి ఇదే తొలిసారి. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడం, ఆహారం, వంట గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. 


సోమవారం కిరోసిన్ లభించకపోవడంతో వందలాది మంది ప్రజలు కొలంబోలో ప్రధాన రహదారిని దిగ్బంధించారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియోలు, ఫొటోలను చూసినపుడు ఆగ్రహంతో ఊగిపోతున్న మహిళలు కనిపిస్తున్నారు. వంట చేయడానికి కిరోసిన్ దొరకకపోవడంతో వీరంతా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న ఓ యాత్రికుల బస్సును వీరు అడ్డుకున్నారు. 


శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి రమేశ్ పథిరన విలేకర్లతో మాట్లాడుతూ, కొలంబోలోని ప్రధాన మార్గాన్ని నిరసనకారులు దిగ్బంధించడంతో సైన్యాన్ని మోహరించినట్లు తెలిపారు. ఆందోళనకారులు యాత్రికులను అడ్డుకున్నట్లు గమనించామన్నారు. కొందరు అక్రమంగా కిరోసిన్‌ను నిల్వ చేసినట్లు తెలుస్తోందని, అందువల్ల సైన్యాన్ని రంగంలోకి దించామని చెప్పారు. అశాంతిని నిరోధించడంలో పోలీసులకు సైన్యం సహకరిస్తుందని రక్షణ రంగ అధికారి ఒకరు తెలిపారు. 


Updated Date - 2022-03-23T19:45:07+05:30 IST