ముక్కంటి హుండీ ఆదాయం రూ.96.96 లక్షలు.. మహిళ చేతివాటం.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-12-30T13:24:11+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ద్వారా రూ.96.96 లక్షల ఆదాయం సమకూరినట్లు

ముక్కంటి హుండీ ఆదాయం రూ.96.96 లక్షలు.. మహిళ చేతివాటం.. అసలేం జరిగింది..!?

చిత్తూరు జిల్లా/శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ద్వారా రూ.96.96 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. బుధ వారం ఆలయ ప్రధాన హుండీ, పరివార దేవతల వద్ద ఉన్న హుండీల లెక్కింపు జరిగింది. ఆ మేరకు.. భక్తుల నుంచి నగదుతోపాటు బంగారం 78.5 గ్రాములు, వెండి 318.100 కేజీలు, పలుదేశాల కరెన్సీ నోట్లు 40 వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈనెల 10వతేది నుంచి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


హుండీ లెక్కింపులో మహిళ చేతివాటం?

హుండీ లెక్కింపులో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ తరపున ఆలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ధనలక్ష్మి గురుదక్షిణామూర్తి సన్నిధి వైపు నుంచి రావడాన్ని ఆలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆమెను తనిఖీ చేయగా, దుస్తుల్లో దాచిన రూ.50వేల నగదు బయటపడినట్లు సమాచారం. నిబంధనల మేరకు పరకామణిలో మహిళలకు ప్రవేశం లేదు. అయితే నగదు లెక్కించే ప్రాంతం వైపు ఆమె ఎలా వెళ్లిందనేది పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు చోరీ ఘటన బయటకు పొక్కకుండా పట్టుబడిన నగదును భక్తుల నుంచి అందిన కానుకలకు జమచేసినట్లు తెలుస్తోంది. కాగా, నగదు చోరీ ఘటన తన దృష్టికి రాలేదనీ, విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. 


Updated Date - 2021-12-30T13:24:11+05:30 IST