ఆ మంత్రి క్షమాపణలు చెప్పాలి: VROలు
ABN , First Publish Date - 2021-12-07T16:45:17+05:30 IST
మంత్రి అప్పలరాజు క్షమాపణలు చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వీఆర్వోలు ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా: పలాసలో వీఆర్వోలను అవమానించిన మున్సిపల్ కమిషనర్ క్షమాపణలు చెప్పారు. ఈ నెల 1న ఓటీఎస్ సమీక్షా సమావేశానికి తమను ఆహ్వానించి.. ఆ తర్వాత గెటౌట్ అంటూ కమిషనర్ రాజగోపాల్ అవమానించారని వీఆర్వోలు ఆందోళన చేశారు. నిరసనకు దిగిన వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి అప్పలరాజు, పలాస మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ తీరుపై వీఆర్వోలు ఆందోళన చేపట్టారు. దాంతో టెక్కలి సబ్ కలెక్టర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వీఆర్వోలకు కమిషనర్తో క్షమాపణలు చెప్పించారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని కమిషనర్ సంజాయిషీ ఇచ్చారు. అయితే మంత్రి అప్పలరాజు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై వీఆర్వోలు గుర్రుగా ఉన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వీఆర్వోలు ప్రకటించారు.
పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకుంటే త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని టెక్కలి డివిజన్ వీఆర్వోల సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్వోలపై ఇష్టానుసారంగా మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గాలి రవి, తారకేశ్వర్, ఛత్రపతి, ఈశ్వరరావు పాల్గొన్నారు.