శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక తుఫాన్‌

ABN , First Publish Date - 2021-12-01T06:47:34+05:30 IST

‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌! అది మోసిన బోయీలెవ్వరు?’ అని ప్రశ్నించిన మహాకవి శ్రీశ్రీ తిరుపతిలో పల్లకిలో ఊరేగాడు.

శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక తుఫాన్‌
పాకెట్‌ సైజ్‌ ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

 పాకెట్‌ సైజ్‌ పుస్తకావిష్కరణ సభలో వక్తలు 


తిరుపతి రూరల్‌, నవంబరు 30: ‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌! అది మోసిన బోయీలెవ్వరు?’ అని ప్రశ్నించిన మహాకవి శ్రీశ్రీ తిరుపతిలో పల్లకిలో ఊరేగాడు. ఆయన చిత్రపటంతోపాటూ, ఆయన రాసిన ‘మహాప్రస్థానం’ కావ్యాన్ని మంగళవారం ఉదయం అంబేడ్కర్‌ ప్రతిమ కూడలి నుంచి ఊరేగించారు. మానవవికాస వేదిక ఆధ్వర్యంలో ఉదయీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ‘మహాప్రస్థానం’ జేబు సైజు పుస్తకం ఆవిష్కరణకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. శ్రీశ్రీ గీతాలను ఆలపిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో పల్లకిని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు భూమన్‌, శైలకుమార్‌, సాకం నాగరాజ వంటి వారు మోశారు. ప్రఖ్యాత విమర్శకుడు విస్కాన్సిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు, ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి, కథారచయిత నామిని సుబ్రమణ్యంనాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జేబులో తుఫాన్‌ పేరుతో జరిగిన ‘మహాప్రస్థానం’ ఆవిష్కరణ సభలో శ్రీశ్రీ కవిత్వాన్ని కీర్తిస్తూ వక్తలు ప్రసంగించారు. మహాప్రస్థానం పద్యాలు అచ్చుకాక ముందే తెలుగు ప్రజలు వాటిని కాగితంపై రాసుకొని జేబుల్లో పెట్టుకొని తిరిగారనివిస్కాన్సిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు పేర్కొన్నారు. మంచి కవిత్వం జేబులోకి పట్టేంత పుస్తకంగా రూపొందిందని కొనియాడారు. ‘మహాప్రస్థానాన్ని ఈ తరం చదవాలి. అది పుస్తకం కాదు డైనమేట్‌. జేబులో ఉంటే గుండెడు బలం ఉన్నట్టే’ అని కవి కె.శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఏ కొంచెమైనా మనిషిగా ఉన్నానంటే అందుకు మహా ప్రస్థానమే కారణమని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ‘మహాప్రస్థానం’ ఒక్కటే ఈ దుష్ట సమాజాన్ని మార్చేస్తుందనే భ్రమ తనకు లేదన్నారు. కానీ, ఈ పుస్తకం కొద్ది మందిలోనైనా పరివర్తన తీసుకొస్తుందనే నమ్మకం, ఆశ ఉన్నాయని, అందుకే ఈ ప్రయత్నం చేశామన్నారు. ‘మహా ప్రస్థానం ఝాంఝాం మారుతం. తిరుపతితో శ్రీశ్రీకి ఎంతో అనుబంధం ఉంది. ఈ పుస్తకం ఆవిష్కరణ ఇక్కడ జరగడం న్యాయం’ అని రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్‌ భూమన్‌ పేర్కొన్నారు. మహాప్రస్థానంపై విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే తాను లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని పీలేరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. డాలర్‌ శేషాద్రి మృతికి సంతాప సూచకంగా సభ మౌనం పాటించింది. ఈ కార్యక్రమంలో మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌, ముద్ర నారాయణ, రాజాచంద్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ దుర్గాప్రసాద్‌,  వాకా ప్రసాద్‌, గంగవరం శ్రీదేవి, కలువగుంట రామ్మూర్తి, పేరూరు బాలసుబ్రమణ్యం, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:47:34+05:30 IST