ఫైజర్ అత్యవసర వినియోగానికి శ్రీలంక ఆమోదం
ABN , First Publish Date - 2021-05-08T21:34:21+05:30 IST
కరోనా థర్డ్ వేవ్తో అల్లడిపోతున్న శ్రీలంక ఫైజర్ కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ల
కొలంబో: కరోనా థర్డ్ వేవ్తో అల్లడిపోతున్న శ్రీలంక ఫైజర్ కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ల సరఫరాను భారత్ కట్టడి చేయడంతో ఏం చేయాలో పాలుపోని ద్వీపదేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 5 మిలియన్ డోసుల ఫైజర్ వ్యాక్సిన్ కోసం ఆర్డర్ చేసింది. ఈ మేరకు ఆ దేశ మంత్రి డాక్టర్ సుదర్శని ఫెర్నాండోపుల్లె తెలిపారు. భారత్లోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్ టీకావైపు శ్రీలంక చూస్తున్నా భారత్లో ప్రస్తుతం టీకాలకు తీవ్రమైన కొరత ఉన్న నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతిని నిలిపివేసింది.
దీంతో దేశంలో పెరిగిపోతున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు మరో మార్గం లేక ఫైజర్ టీకాకు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఆ టీకాకు అనుమతి ఇచ్చిన తొలి దక్షిణాసియా దేశంగా శ్రీలంక రికార్డులకెక్కింది. ఆ దేశం ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వి, చైనా సినిఫార్మ్ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. శ్రీలంకలో గత 24 గంటల్లో 1,914 కేసులు వెలుగు చూశాయి. 19 మంది చనిపోయారు.