109 పరుగులకే కుప్పకూలిన లంక.. మళ్లీ నిరాశపర్చిన మయాంక్

ABN , First Publish Date - 2022-03-13T21:11:27+05:30 IST

భారత్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో శ్రీలంక జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ముఖ్యంగా బుమ్రా

109 పరుగులకే కుప్పకూలిన లంక.. మళ్లీ నిరాశపర్చిన మయాంక్

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో శ్రీలంక జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ముఖ్యంగా బుమ్రా దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ కకావికలమైంది. పేక మేడలా కుప్పకూలింది. దీనికి తోడు అశ్విన్, షమీ కూడా వికెట్ల కోసం పోటీ పడడంతో శ్రీలంక బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 86/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 23 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బుమ్రా ఐదు వికెట్లు తీసుకోగా, షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.


అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (20), హనమ విహారి క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఇండియా ఆధిక్యం 186 పరుగులకు చేరింది.

Updated Date - 2022-03-13T21:11:27+05:30 IST