శ్రీలంకలో ‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-28T00:51:15+05:30 IST

‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం 13 మంది సభ్యులతో ఓ

శ్రీలంకలో ‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం కమిటీ ఏర్పాటు

కొలంబో : ‘ఒక దేశం-ఒకే చట్టం’ కోసం 13 మంది సభ్యులతో ఓ టాస్క్‌ఫోర్స్‌ను శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నియమించారు. ముస్లిం వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రదర్శించే బౌద్ధ సన్యాసి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.  2019 ఎన్నికల్లో ఆయన ‘ఒక దేశం-ఒకే చట్టం’ నినాదంతో బౌద్ధుల మద్దతు పొందారు.


శ్రీలంకలో బౌద్ధులు అత్యధికంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజపక్స ‘ఒక దేశం-ఒకే చట్టం’ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీంతో బౌద్ధుల మద్దతు అధికంగా లభించి, ఆయన విజయం సాధించారు. 


‘ఒక దేశం-ఒకే చట్టం’ ముసాయిదాను రూపొందించడం కోసం బౌద్ధ సన్యాసి గలగొడాత్థే జ్ఞానసార నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేక గెజిట్ ద్వారా దేశాధ్యక్షుడు రాజపక్స ఏర్పాటు చేశారు. జ్ఞానసార ముస్లిం వ్యతిరేకతకు చిహ్నంగా పేరు పొందారు. ఈ కమిటీలో నలుగురు ముస్లింలు కూడా ఉన్నారు. అయితే మైనారిటీలైన తమిళులకు మాత్రం ఈ కమిటీలో స్థానం కల్పించలేదు. 


ఇస్లామిక్ అతివాదం పెరుగుతున్న నేపథ్యంలో సింహళ మెజారిటీ ప్రజల మద్దతును సాధించేందుకు ‘ఒక దేశం-ఒకే చట్టం’ నినాదాన్ని శ్రీలంక పొదుజన పెరమున ప్రచారం చేసింది. షరియా చట్టాన్ని ఆచరించడం వల్ల ముస్లిం అతివాదం పెరుగుతోందని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ నినాదానికి మరింత ఊపు రావడానికి కారణాల్లో ఒకటి... 2019లో ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడులు. ఈ దాడుల్లో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడులకు బాధ్యత నేషనల్ థవ్హీద్ జమాత్ అనే ఇస్లామిక్ సంస్థ అనే ఆరోపణలు వచ్చాయి. 


Updated Date - 2021-10-28T00:51:15+05:30 IST