సన్‌రైజర్స్ ధమాకా.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం

ABN , First Publish Date - 2022-04-18T01:01:33+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో విజయం సాధించి

సన్‌రైజర్స్ ధమాకా.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో విజయం సాధించి వరుసగా నాలుగో విజయాన్ని కైవసం చేసుకుంది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 14 పరుగుల వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) అవుటయ్యాడు. అయితే, అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34), మార్కరమ్ (41), నికోలస్ పూరన్ (35) రాణించడంతో  హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది.  


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు పంజాబ్ బ్యాటర్లు తలవంచారు. వరుస పెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, ఒక్క లివింగ్‌స్టోన్ మాత్రం క్రీజులో కుదురుకుని బ్యాట్ ఝళిపించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. తాజా గెలుపుతో హైదరాబాద్ నాలుగో స్థానానికి చేరుకోగా, పంజాబ్ ఏడో స్థానానికి దిగజారింది.

Updated Date - 2022-04-18T01:01:33+05:30 IST