ఠాణా నుంచి తప్పించుకునే యత్నం.. చివరికిలా..!
ABN , First Publish Date - 2022-05-22T19:58:57+05:30 IST
ఠాణా నుంచి తప్పించుకునే యత్నం.. చివరికిలా..!
- కిందపడి మళ్లీ పోలీసులకు చేక్కిన వైనం
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : అత్యాచారం కేసులో నిందితుడు ఎస్ఆర్నగర్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయాలై పోలీసులకు దొరికిపోయాడు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతి(19)పై అత్యాచారానికి పాల్పడిన నిర్మల్కు చెందిన కొత్వాల కృష్ణ అలియాస్ సిద్ధ్దార్థరెడ్డిపై మార్చి 26న ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధారెడ్డిగా చెప్పుకుని, సినిమాల్లో అవకాశం ఇస్తానని పలువురు యువతులను మోసం చేసిన సంఘటనల్లో కొత్వాల్ కృష్ణ(40) నిందితుడు. అప్పట్లో నిర్మల్లో పోలీసులపై కూడా దాడికి పాల్పడటంతో అక్కడ రౌడీషీట్ కూడా తెరిచారు.
మోస్ట్ వాంటెడ్గా ఉన్న కృష్ణపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఆ తర్వాత కూడా మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో యువతిని మోసగించి, ఆమె నగలను కాజేశాడు. అతడి కాల్డేటాపై నిఘా పెట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు మరో యువతిని ట్రాప్ చేస్తున్నాడని తెలుసుకుని వల పన్ని శనివారం పట్టుకున్నారు. మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లాలని చెప్పిన కొత్వాల్ కృష్ణ పారిపోయేందుకు పథకం వేశాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ రెండో అంతస్తు వరండాపై నుంచి కిందకు జారాడు. ఇలా జారుతూ కిందకు వస్తున్న క్రమంలో గోడకు ఉన్న కరెంట్ తీగల వైపునకు ఉన్న ఇనుప క్లాంప్ కాలుకు తగిలి కోసుకుపోయింది. వెంటనే తేరుకున్న పోలీసులు పట్టుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన కృష్ణపై మరో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.