శిక్షణకు డబ్బుల్లేక కాదు..
ABN , First Publish Date - 2020-07-16T09:15:58+05:30 IST
తాను బీఎండబ్ల్యూ కారును అమ్మేయాలనుకుంది.. శిక్షణకు డబ్బుల్లేక కాదని స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ స్పష్టం చేసింది. లగ్జరీ కారు నిర్వహణ తనవల్ల ...
‘బీఎండబ్ల్యూ’ అమ్మకం పోస్ట్పై ద్యూతీ వివరణ
న్యూఢిల్లీ: తాను బీఎండబ్ల్యూ కారును అమ్మేయాలనుకుంది.. శిక్షణకు డబ్బుల్లేక కాదని స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ స్పష్టం చేసింది. లగ్జరీ కారు నిర్వహణ తనవల్ల కాకపోవడం వల్లే దాన్ని అమ్మకానికి పెట్టి నట్టు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీఎండబ్ల్యూను అమ్ముతున్నట్టు ఇటీవల ద్యూతీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. తర్వాత ఆ పోస్ట్ను తొలగించినా.. అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఒడిశా ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, అథ్లెటిక్ సమాఖ్యతో పాటు అనేకమంది స్పాన్సర్లు ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిచ్చినా ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటూ ద్యూతీ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్ట్పై వివరణ ఇస్తూ.. ‘ఖరీదైన కారు నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. నాకు ఆ కారుతో అంతగా ప్రయోజనం లేదు. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బును ఒలింపిక్స్ శిక్షణ కోసం వెచ్చించాలనుకున్నా. అంతేకానీ.. శిక్షణకు డబ్బుల్లేక ఆ కారును అమ్మాలనుకోవడం లేదు. ఒడిశా రాష్ట్రంతో పాటు అనేకమంది నాకు ఆర్థికంగా ఎన్నోసార్లు అండగా నిలిచారు’ అని ద్యూతీ వెల్లడించింది.