సత్యమూర్తిని వారణాసిలో గుర్తించాం
ABN , First Publish Date - 2022-06-29T06:12:33+05:30 IST
సత్యమూర్తిని వారణాసిలో గుర్తించాం
- అన్నపూర్ణ ఆచూకీ కోసం స్పెషల్ టీమ్లు
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం : ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, జూన్ 28: తన భార్య ఆచూకీని కనిపెట్టకపోతే తనతోపాటు కూతుళ్ల శవాల లోకేషన్ను షేర్ చేస్తానని మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆడియో, వీడియో సందేశాలు పోస్ట్చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన స త్యమూర్తి, అతడి కూతుళ్లను వారణాసిలో గుర్తించి తీసుకొచ్చామని, త్వరలో సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఆచూకీని కనుగొంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న దొరిశెట్టి సత్యమూర్తి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేస్తూ.. తన భార్య అన్నపూర్ణను 48గంటల్లో పోలీసులు కనిపెట్టాలని.. లేకుంటే తన కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకునే లోకేషన్ షేర్చేస్తామని చెప్పి అదృశ్యమయ్యాడన్నారు. తాండూరు పోలీసులు బృందంగా సీసీ కెమెరాలను పరిశీలించారన్నారు. సత్యమూర్తి, అతడి ఇద్దరు కూతుళ్లను శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించి అక్కడి నుంచి ముంబై, వారణాసికి వెళ్లినట్టు ని ర్ధారించామన్నారు. వారణాసికి ఒక పోలీస్ టీమ్ను పంపామన్నారు. అక్కడ ట్యాక్సీ డ్రైవర్ తెలిపిన వివరాల ఆధారంగా వారు ఉన్న హోటల్కు చేరుకొని ఈ నెల 27న వికారాబాద్కు తీసుకువచ్చామన్నారు. సత్యమూర్తి, ఆయన పిల్లలు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటారోనని లోకల్ పోలీసు లు, పోలీసు టీమ్లు చాకచక్యంగా వ్యవహరించి రెండు రోజులు శ్రమించి వికారాబాద్కు తీసుకొచ్చామన్నారు. అన్నపూర్ణ మిస్సింగ్ కేసు విషయానికి వస్తే.. ఆమె మార్చి 6న అదృశ్యమైందని, అదే నెల 8న సత్యమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అన్నపూర్ణ ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతుకుతున్నామన్నారు. ఆ మె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇంకేమైనా జరిగిందా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నామన్నారు. తన భార్య అదృశ్యం విషయంలో సత్యమూర్తి వద్ద ఉన్న ఆధారాలనూ పరిశీలిస్తామన్నారు. అన్నపూర్ణ మిస్సింగ్లో ఎవరి హస్తమైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా వారి దూరపు బంధువులైన మల్లికార్జున్, అనిల్ అనే వ్యక్తుల సంభాషణల్లో ఆమె దుబాయి వెళ్లిందని, అక్కడ నుంచి ఫేక్ పాస్పోర్టు వివరాలు వస్తున్నాయని అనడంలో కొన్ని అనుమానాలున్నాయని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ విషయంలో పరిశోధిస్తున్నామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని, సత్యమూర్తి వివరాలను పరిగణలోకి తీసు కొని విచారిస్తామన్నారు. సత్యమూర్తి కుటుంబాన్ని రక్షించిన స్ఫూర్తితోనే అన్నపూర్ణ మిస్సింగ్ మిస్టరీనీ ఛేదిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్గౌడ్, తాండూరు పోలీసులు ఉన్నారు.
- ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలి
వికారాబాద్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో కార్మిక, స్ర్తీ శిశు సంక్షేమ, పోలీసు, బాలల సంక్షేమ సమితి, రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోటిరెడ్డి మాట్లాడుతూ.. తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా చూడాలని, బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. పిల్లలతో బిక్షాటన, కర్మాగారాలు, ఇతర చోట్ల పనులు చేయించకుండా చూడాలన్నారు. బడీ డు పిల్లలంతా బడుల్లోనే ఉండాలన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఏఎస్పీ రశీద్, డీఎంహెచ్వో రేణుకాదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివా్సరావు, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశం, ఆర్డీవో అశోక్కుమార్, ఏఎల్వో శశివర్ణ, సీడబ్ల్యూసీ మెంబర్లు సవితాదేవి, సంఘమేశ్వర్, రామేశ్వర్, ఎస్ఐలు విశ్వజన్, సత్యనారాయణ, విమల, ఎన్జీవోలు సుందర్, ఇందిర, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ పాల్గొన్నారు.