కలగానే మిగిలె..

ABN , First Publish Date - 2022-01-15T09:30:20+05:30 IST

కలగానే మిగిలె..

కలగానే మిగిలె..

మూడో టెస్టులోనూ భారత్‌ చిత్తు

2-1తో సిరీస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా 

రాణించిన పీటర్సన్‌ 


పాయే.. ఇదీ పాయే.. మొత్తంగా సిరీసే చేజారె. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీ్‌సను పట్టేద్దామనుకున్న 

టీమిండియా ఎప్పటిలాగే బోల్తా పడింది. శుక్రవారం ఆతిథ్య జట్టు మరో 112 పరుగులే చేయాల్సిన వేళ భారత్‌ గెలుపుపై పెద్దగా అంచనాలు లేవు. బౌలర్ల నుంచేమైనా పోరాటం కనిపిస్తుందని భావించినా ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగారు. పీటర్సన్‌, డుస్సెన్‌, బవుమా సులువుగా సఫారీలను విజయం వైపు నడిపించారు. ఓవరాల్‌గా తొలి టెస్టును గెలిచి అంచనాలను రెట్టింపు చేసుకున్న కోహ్లీ సేన ఆ తర్వాత వరుసగా బ్యాటింగ్‌లో విఫలమై సిరీ్‌సలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.


కేప్‌టౌన్‌: స్టార్‌ క్రికెటర్లు లేక అత్యంత బలహీనంగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమే చేసింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన టీమిండియాపై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. తద్వారా శుక్రవారం ముగిసిన  మూడో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన ఈ జట్టు.. మూడు టెస్టుల సిరీ్‌సను సైతం 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్‌ ఆరంభంలోనే స్టార్‌ పేసర్‌ నోకియా గాయంతో దూరమైనా.. తొలి టెస్టు ముగిశాక డికాక్‌ ఈ ఫార్మాట్‌ నుంచే వైదొలిగినా సఫారీలు పట్టు వదలకుండా పోరాడారు. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ విఫలమైన టీమిండియాకు నిరాశే మిగిలింది. 212 పరుగుల ఛేదనలో కీగన్‌ పీటర్సన్‌ (113 బంతుల్లో 10 ఫోర్లతో 82) కీలక ఇన్నింగ్స్‌తో విజయానికి బాటలు వేశాడు. దీంతో నాలుగో రోజు ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 63.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. డుస్సెన్‌ (95 బంతుల్లో 3 ఫోర్లతో 41 నాటౌట్‌), బవుమా (58 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్‌) చివరికంటా నిలిచి రెండో సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ కూడా పీటర్సన్‌కు దక్కింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223.. రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసింది.

ఆడుతూ.. పాడుతూ: 101/2 స్కోరుతో మూడో రోజును ముగించిన దక్షిణాఫ్రికా.. ఈ మ్యాచ్‌ ఫలితంపై అందరికీ ఓ అంచనా వచ్చేలా చేసింది. శుక్రవారం బరిలోకి దిగాక కూడా అందుకు  విరుద్ధంగా ఏమీ జరుగలేదు. భారత బౌలర్ల నుంచి అద్భుతాలేమీ కనిపించలేదు. లక్ష్యం తక్కువగానే ఉండడంతో క్రీజులో ఉన్న పీటర్సన్‌, డుస్సెన్‌  ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకుసాగారు. ప్రత్యర్థి నుంచి కవ్వింపు మాటలు ఎదురైనా ప్రొఫెషనల్‌ ఆటతీరును కనబర్చారు. అయితే పీటర్సన్‌ 59 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో పుజార వదిలేశాడు. అప్పటికి జట్టు విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ ఈ క్యాచ్‌ పట్టి ఉంటే కచ్చితంగా సఫారీలపై ఒత్తిడి పడేది. చివరకు శార్దూల్‌ ఠాకూర్‌ చేతిలో పీటర్సన్‌ బౌల్డ్‌ అయినా భారత్‌ సంబరపడాల్సిందేమీ లేకపోయింది. తొలి సెషన్‌ ముగిసేసరికి దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 41 పరుగుల దూరంలోనే ఉంది. దీంతో క్రీజులో ఉన్న డుస్సెన్‌, బవుమా మరో 8.3 ఓవర్లలోనే జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.


దక్షిణాఫ్రికాలో రెండు టెస్టు 

సిరీ్‌సలు ఓడిన భారత జట్టు 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.

టాస్‌ గెలిచినా టెస్టును ఓడడం కోహ్లీకిది మూడోసారి.

సిరీ్‌సలో రెండుసార్లు 200+ ఛేదనను పూర్తి చేసిన ఐదో జట్టు దక్షిణాఫ్రికా. 


1-0 ఆధిక్యం సాధించినా సిరీస్‌ కోల్పోవడం భారత్‌కిది ఆరోసారి. అలాగే 0-1తో వెనుకబడినా సిరీస్‌ నెగ్గడం దక్షిణాఫ్రికాకు ఐదోసారి. ఈ విజయాలన్నీ  స్వదేశంలోనే రావడం విశేషం. 

 

స్కోరు బోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 210

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 198


దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌:   మార్‌క్రమ్‌ (సి) రాహుల్‌ (బి) షమి 16; ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 30; పీటర్సన్‌ (బి) శార్దూల్‌ 82; డుస్సెన్‌ (నాటౌట్‌) 41; బవుమా (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 63.3 ఓవర్లలో 212/3. వికెట్ల పతనం: 1-23, 2-101, 3-155. బౌలింగ్‌: బుమ్రా 17-5-54-1; షమి 15-3-41-1; ఉమేశ్‌ యాదవ్‌ 9-0-36-0; శార్దూల్‌ ఠాకూర్‌ 11-3-22-1; అశ్విన్‌ 11.3-1-51-0.


Updated Date - 2022-01-15T09:30:20+05:30 IST