సమైక్య కృషితో ఉన్నత స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2021-06-24T04:06:36+05:30 IST
ద ఒలింపిక్ అసోసియేషన్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒలింపిక్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ జూమ్ సమావేశంలో జిల్లాకు చెందిన ప్రముఖ క్రీడా నిపుణులు పాల్గొని జిల్లా క్రీడారంగం, క్రీడాకారుల అభివృద్ధిపై పలు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆన్లైన్ ఒలింపిక్ దినోత్సవంలో క్రీడా నిపుణుల సూచనలు
విశాఖపట్నం (స్పోర్ట్సు), జూన్ 23: ద ఒలింపిక్ అసోసియేషన్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒలింపిక్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ జూమ్ సమావేశంలో జిల్లాకు చెందిన ప్రముఖ క్రీడా నిపుణులు పాల్గొని జిల్లా క్రీడారంగం, క్రీడాకారుల అభివృద్ధిపై పలు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు గణబాబు మాట్లాడుతూ వర్దమాన ఔత్సాహిక క్రీడాకారులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని క్రీడాంశాలకు వెంటాడుతున్న కోచ్ల కొరత తీర్చాలని సూచించారు. ఉత్తమ కోచ్ల శిక్షణలో ప్రతిభ గల క్రీడాకారులు రూపొందుతారని తెలిపారు.
కరోనా కారణంగా గత, ఈ ఏడాది జరగాల్సిన వేసవి క్రీడా శిబిరాలు నిలిచిపోవడంతో స్కూల్ చిన్నారులు క్రీడలకు దూరం కావడమే కాక, వారిలోని ప్రతిభ గల వర్దమాన క్రీడాకారులను గుర్తించే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. క్రీడాభివృద్ధికి అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ద ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కరోనా నిబంధనల కారణంగా ఒలింపిక్ డే రన్ని నిర్వహించలేకపోయామని చెప్పారు. గత ఏడాది కూడా కరోనా ప్రభావం ఉన్నా ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహక బహుమతులు బహుమతులు అందజేశామని తెలిపారు. క్రీడాభివృద్ధి, క్రీడాకారుల ప్రోత్సాహానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు.
ఏయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్.విజయ్మోహన్, జిల్లా స్పోర్ట్సు అథారిటీ చీఫ్ కోచ్ ఎన్.సూర్యారావు, ఒలింపియన్ ఎం.వి..మాణిక్యాలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఈ.ప్రసాదరావు, ఐ.వెంకటేశ్వరరావు, భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ, పలు క్రీడా సంఘాలు ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు.