భూసేకరణ వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-07-07T05:53:55+05:30 IST
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
భూనిర్వాసితులకు అన్యాయం జరగొద్దు
హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్, జూలై 6: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధశారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు, నిమ్జ్ ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూసేకరణ పురోగతి, భూసేకరణ జాప్యానికి గల కారణాలు, ఆయా ప్రాజెక్టుల కింద అవార్డుల పరిస్థితి, పెండింగ్లో ఉన్న చెల్లింపులు తదితర అంశాలపై ఆయా ప్రాజెక్టుల వారిగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. అవార్డు పాసైన వాటికి చెల్లింపు చేయాలని సూచించారు. క్లియర్గా ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. సర్వే ల్యాండ్స్ రికార్డ్స్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నీటి పారుదల, ఆర్అండ్ బీ, జాతీయ రహదారులు, టీఎ్సఐఐసి. నిమ్జ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘రైతుబంధు’ను పాత బకాయిల కింద జమ చేయొద్దు
రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేస్తే తీవ్రంగా పరిణిస్తామని జిల్లా కలెక్టర్ శరత్ హెచ్చరించారు. కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా జరిగితే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ శరత్ సూచించారు.
హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు హాస్టళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, ఖాళీలు, పదోతరగతి ఉత్తీర్ణత ఫలితాలు, ఉపకార వేతనాలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఇస్తున్న మెనూను అన్ని వసతి గృహాల్లో విధిగా అమలు చేయాలన్నారు. హాస్టల్ వార్డెన్లు హాస్టల్ విద్యార్థుల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలే్షరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, షోషల్ వెల్ఫేర్ ఆర్ సీవో బీమయ్య, ఎస్టీ వెల్ఫేర్ ఆర్సీవో కళ్యాణి, ఎం.జె.పి.జిల్లా కోఆర్డినేట్ అధికారి సంతోషి తదితరులు పాల్గొన్నారు.