తీవ్రమైన నేరాల్లో దర్యాప్తు వేగవంతం
ABN , First Publish Date - 2020-07-09T11:04:44+05:30 IST
పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.
విజయనగరం క్రైం, జూలై 8: పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విజయనగరం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాల్లో సాక్షుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. కేసుల్లో సాక్ష్యాలుగా ఉపయోగపడే వస్తువులను పరీక్షల కోసం ఆర్ఎస్ఎల్కు పంపి నివేదికలను త్వరితగతిన పొందాలని, అభియోగపత్రాలను కోర్టులో నిర్దిష్ట సమయంలోగా దాఖలు చేయాలని ఆదేశించారు.
వ్యక్తులు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కేసుల్లో నిందితులను అరెస్టు చేసినప్పుడు హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి కొవిడ్ పరీక్షలు చేయాలని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. కొవిడ్ కేసులు 10 కంటే ఎక్కువ నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో కంటై న్మెంట్ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయా లన్నారు. ఎటువంటి రాకపోకలు లేకుండా చూడాలని, శానిటేషన్ పనులు జరిగేలా మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులతో సమ న్వయం చేసుకోవాలని సూచించారు.
పోలీసు సిబ్బందికి కరోనా సోకకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. బెటాడిన్ ద్రావణాన్ని నీటిలో కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తగిన మోతాదులో నోట్లో వేసుకుని పుక్కి లించాలని చెప్పారు. డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, బి.మోహనరావు, ట్రైనీ డీఎస్పీ సుభాష్, ఏఆర్ డీఎస్పీ శేషాద్రీ, సీఐలు వెంకటఅప్పారావు, రాంబాబు, శ్రీనివాసరావు, ఎర్రంనాయుడు, శ్రీహరిరాజు, పీఎస్ మంగవేణి, గోవిందరావు, శ్రీనివాసరావు, శ్రీధర్, వెంకటరావు, సుభద్రమ్మ, తిరుపతిరావు, న్యాయ సలహాదారులు పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.