స్పీడు పెంచిన నగర పోలీస్
ABN , First Publish Date - 2020-07-04T10:52:11+05:30 IST
నగరమంతా కంటైన్మెంట్ జోన్ కావడంతో నిబంధనల అమలు విషయంలో పొలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ సిద్ధార్థ్కౌశల్
నిబంధనల అమలు నిర్లక్ష్యంపై ఎస్పీ ఆగ్రహం
100 వాహనాలు సీజ్ చేసిన సిబ్బంది
ఒంగోలు(క్రైం), జూలై 3 : నగరమంతా కంటైన్మెంట్ జోన్ కావడంతో నిబంధనల అమలు విషయంలో పొలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ సిద్ధార్థ్కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... శుక్రవారం నగరం నలుమూలలతో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారు. అనవసరంగా వాహనాలపై తిరిగే వారిని మందలించడంతో పాటు కొన్ని వాహనాలు సీజ్ చేసి స్థానిక డీఆర్ఆర్ఎం స్కూలు ఆవరణలోకి తరలించారు.
మరికొన్ని చోట్ల దురుసుగా కూడా వ్యవహరించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. రత్నమహల్ సమీపంలో సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగి విధులు ముగించుకుని తన భర్త మోటారుసైకిల్పై ఇంటికి వెళుతుండగా వారిపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా మారింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించారు. శివారు ప్రాంతాల్లో ఉన్న చెక్పోస్టుల వద్ద నగరంలోకి వచ్చే వాహనదారులను అడ్డగించి వాహనాలు సీజ్ చేశారు. మొత్తంగా సుమారు వంద వాహనాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు.