రూ.30,791 కోట్ల స్పెక్ట్రమ్ చెల్లింపులు
ABN , First Publish Date - 2022-01-20T06:23:47+05:30 IST
స్పెక్ట్రమ్ వాయిదా బకాయిలకు సంబంధించి టెలికాం శాఖకు రూ.30,791 కోట్ల చెల్లింపులు జరిపినట్లు రిలయన్స్ జియో తెలిపింది.
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వాయిదా బకాయిలకు సంబంధించి టెలికాం శాఖకు రూ.30,791 కోట్ల చెల్లింపులు జరిపినట్లు రిలయన్స్ జియో తెలిపింది. 2021 మార్చి కంటే ముందు జరిగిన వేలం ప్రక్రియల్లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ బకాయిలను వడ్డీతో సహా చెల్లించినట్లు బుధవారం పేర్కొంది. 2014, 2015, 2016లో జరిగిన వేలం ప్రక్రియల్లో దక్కించుకున్న స్పెక్ట్రమ్తో పాటు భారతీ ఎయిర్టెల్ తో కలిసి ట్రేడింగ్ ఆఫ్ రైట్ టు యూజ్ ద్వారా 2021లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ బకాయిలన్నింటినీ పరిష్కరించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ వేలం ప్రక్రియలతో పాటు ట్రేడింగ్ ఒప్పందం ద్వారా రిలయన్స్ జియో మొత్తం 585.3 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను కలిగి ఉంది.
ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్లో జోరు : రిలయన్స్ జియో ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో బీఎ్సఎన్ఎల్ను వెనక్కి నెట్టి మొదటిస్థానానికి చేరుకుంది. ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ టెలికాం చందాదారుల నివేదిక ప్రకారం.. 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో ముందుంది. అక్టోబరులో జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 41.6 లక్షలుండగా.. నవంబరులో 43.4 లక్షలకు పెరిగింది. బీఎ్సఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య నవంబరులో 42 లక్షలకు తగ్గింది.