ఉచ్చిలిలో నేలవాలిన ఆరటి తోటను పరిశీలిస్తున్న మల్లికార్జునరావు
- జిల్లా ఉద్యానవన శాఖాధికారి మల్లికార్జునరావు
ఆత్రేయపురం, మే 18: అసాని తుఫాన ప్రభావంతో కోనసీమ జిల్లాలో నష్టపోయిన అంతర పంటల నమోదుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉద్యానవన అధికారి ఎన్.మల్లికార్జునరావు పేర్కొన్నారు. మండలంలోని ఉచ్చిలి, వద్దిపర్రు, వెలిచేరు తదితర గ్రామాల్లో నష్టపోయిన అరటి పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన రైతుల జాబితాలు, పంట నష్టాలను ఈ బృందం పరిశీలించి నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తుందని తెలిపారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. పర్యటనలో ఉద్యానవన శాఖ మండల అధికారి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.