నీటి సహకార సంఘాల ఎన్నికలు లేనట్లేనా..?

ABN , First Publish Date - 2020-08-03T16:16:49+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. కానీ చెరువుల అభివృద్ధికి పాటుపడే సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పదేళ్లుగా

నీటి సహకార సంఘాల ఎన్నికలు లేనట్లేనా..?

ఎనిమిది సంవత్సరాలుగా కొలువుదీరని పాలకవర్గాలు

కబ్జాకు గురవుతున్న చెరువులు.. పట్టించుకోని అధికారులు

కాలువలు, కత్వలు, ఊట చెరువులు కబ్జా.. తూములు, కట్టలు పగుళ్లు.. అలుగు లీకేజీలు


మోమిన్‌పేట(రంగారెడ్డి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. కానీ చెరువుల అభివృద్ధికి పాటుపడే సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పదేళ్లుగా ఈ సంఘాలకు ఎన్నికలు లేక చెరువులపై పర్య వేక్షణ కరువైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, సాగు నీటి అధ్యక్షులు లేక చాలా గ్రామాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. మోమిన్‌పేట మండలపరిధిలో ఎనిమిది చెరువులున్నాయి. ఊటచెరువులు-20, మిగతా ఆనకట్టలు, కత్వలు 36 ఉన్నాయి. మోమిన్‌పేట నంది వాగు ప్రాజెక్టు, టేకులపల్లి అయ్యమ్మ చెరువు, ఎన్కతలలోని పెద్దచెర్వు, దుర్గంచెర్వు, దేవరంపల్లి, వెల్‌చాల్‌, చక్రంపల్లి, కేసారం గ్రామాల్లో పెద్ద చెరువులు ఉన్నాయి. ఇందులో కొన్ని కుంటలు మినహాయించి మొత్తం చెరువులను మూడు విడతల్లో ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేశారు. వీటిలో వంద ఎకరాల్లో పైన ఉన్న చెరువులకు నీటి సహకార సంఘాలు ఉండేవి. 


గతంలో నీటి సంఘాలు ఇలా..

ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగానే చెరువులు, కుంటల కింద ఉన్న ఆయకట్టు రైతులందరూ కలిసి చైర్మన్‌ను, డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఆయకట్టు కిందఉన్న రైతులే ఈ పద వుల్లో కొనసాగేవారు. పాలకవర్గం సభ్యులు చెరువుల నిర్వహణ, తూముల ద్వారా నీటిని పంట పొలాలకు విడుదల చేసి పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునే వారు. రైతులు సమన్వయ పరుచుకుంటూ చెరువుల అభివృద్ధికి, ఆయకట్టు, తూములు మరమ్మతులు, పంట కాలువలను శుభ్రం చేసేవారు. వీరి కింద నీరడివారు చెరువు పనులు చూసుకునేవారు.


2007-08 సంవత్సరంలో సాగు నీటి ఎన్నికలు

వంద ఎకరాల విస్తీర్ణం పైబడిన చెరువులకు మాత్రమే రెండేళ్లకు ఒకసారి నీటి సంఘాల ఎన్నికలు జరిగేవి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పటి ప్రభుత్వం సాగునీటి సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించింది. మండలంలోని 8 చెరువులకు పాలకవర్గం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గం 2010 సంవత్సరానికి ముగిసింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ పాలకవర్గం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదేళ్లుగా తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రస్తు తం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. చెరువులు, ఊటచెరువులు, కుంటలు, కత్వలు, చెక్‌డ్యాంలు పున రుద్ధరణకు మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం నీటి సహకార సంఘాల ఎన్నికల విషయాన్ని మాత్రం మరిచింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎన్నికలు నిర్వహించి చెరు వులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతు న్నారు. మోమిన్‌పేట నందివాగు ప్రాజెక్టు, టేకులపల్లి అయ్యమ్మ చెరువు, ఎన్కతల పెద్ద చెరువు, దేవరంపల్లి, కేసారం, వెల్‌చాల్‌, చక్రంపల్లి, దుర్గం చెర్వు గ్రామాల్లో ఉన్న చెరువులు, భూములు, శికం భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాటిని రక్షించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. 


Updated Date - 2020-08-03T16:16:49+05:30 IST