ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2021-07-31T07:47:58+05:30 IST
ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతా అంశాలపై దృష్టి సారించి నిర్దిష్ట వ్యవధిలోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) పి.రాజబాబు అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 30: ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతా అంశాలపై దృష్టి సారించి నిర్దిష్ట వ్యవధిలోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) పి.రాజబాబు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కలెక్టరేట్లో 38వ జేసీగా తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణాలకు భూసేకరణతో పాటు పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సిన సలహాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఈ-క్రాప్ బుకింగ్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు.జేసీ వీరబ్రహ్మం, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అమరేంద్ర, సభ్యులు అన్వర్ హుస్సేన్, పార్థసారధి, హేమాద్రి రాజు, జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు బాలాజీ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మార్కొండయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్యనాభం తదితరులు జేసీకి శాలువ కప్పి సన్మానించారు.