రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా
ABN , First Publish Date - 2021-04-13T05:35:53+05:30 IST
చింతపల్లి, జీకేవీధి మండలాల్లో రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మైదాన ప్రాంత వ్యాపారులు, కూలీలు క్వారీల్లో తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ రేంజ్ అధికారి పీవీ రవివర్మ తెలిపారు.
అటవీశాఖ రేంజ్ అధికారి పీవీ రవివర్మ
చింతపల్లి, ఏప్రిల్ 12: చింతపల్లి, జీకేవీధి మండలాల్లో రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మైదాన ప్రాంత వ్యాపారులు, కూలీలు క్వారీల్లో తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ రేంజ్ అధికారి పీవీ రవివర్మ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సిగినాపల్లి, గుర్రాళ్లగొంది, సత్యవరంలో రంగురాళ్ల క్వారీలు ఉన్నాయని, కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రంగురాళ్ల వ్యాపారులు తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తుంటారని చెప్పారు. దీంతో అటవీ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామని, 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. సిగినాపల్లి, గుర్రాళ్లగొంది, సత్యవరం క్వారీలను స్వయంగా పరిశీలించానని, రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా చిన్న చిన్న రంధ్రాలు కనిపించడంతో వాటిని గాజుపెంకులు, బండరాళ్లు, కాంక్రీట్తో మూసివేశామన్నారు. వ్యాపారులు రంగురాళ్ల క్వారీల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చేవిధంగా పరిసర గ్రామాల గిరిజనులతో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయన వెంట ఎఫ్ఎస్వో నూకరాజు, ఎఫ్బీవో భూషణం, ఏవీవో గోవిందరాజు వున్నారు.