ఉద్యోగ సంబరం
ABN , First Publish Date - 2020-07-07T10:27:37+05:30 IST
దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక డీఎస్సీ ద్వారా
ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థులు 33 మందికి నియామక ఉత్తర్వులు
నెల్లూరు (విద్య), జూలై 6 : దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక డీఎస్సీ ద్వారా పాఠశాల సహాయకుల(ఎస్ఏ) పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం 33 మందికి జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి నియామక ఉత్తర్వులు అందచేశారు. దీంతో ఆ అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన 35 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరిలో ఒక అభ్యర్థికి వేరే ఉద్యోగం రావడంతో ఈ ఉద్యోగం అవసరం లేదని స్వచ్ఛందంగా రాసిచ్చారు.
ఇక మరో అభ్యర్థికి అర్హత లేకపోవడంతో మిగిలిన 33 మందికి పోస్టింగ్ ఇచ్చినట్లు డీఈవో జనార్థనాచార్యులు తెలిపారు. జిల్లాకు కేటాయించిన 43 పోస్టుల్లో 70 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశారు. మిగిలిన 30 శాతం పోస్టులను ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో 8, 10 తరగతుల్లో దివ్యాంగ విద్యార్థులకు బోధన చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీసీ డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.