తిరుపతిలో ప్రత్యేక కరోనా ఆస్పత్రి
ABN , First Publish Date - 2020-03-29T11:19:57+05:30 IST
రాయలసీమ జిల్లాల ప్రజల కోసం తిరుపతిలో ప్రత్యేక కోవిడ్-19 (కరోనా) ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు.
టీటీడీ సహకారంతో వారంలో అందుబాటులోకి..
తిరుపతి (వైద్యం), మార్చి 28: రాయలసీమ జిల్లాల ప్రజల కోసం తిరుపతిలో ప్రత్యేక కోవిడ్-19 (కరోనా) ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్స్ పక్కనే ఉన్న శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. శనివారం ఆస్పత్రి భవనాన్ని కలెక్టర్ భరత్ గుప్తాతో కలిసి పరిశీలించారు. టీటీడీ సహకారంతో ఈ ఆస్పత్రిని వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. కాగా.. ఇదివరకే నగరంలోని నిరాశ్రయుల కోసం రోజూ అన్నప్రసాదం ఉచితంగా ఇవ్వాలని టీటీడీని కోరడం జరిగిందన్నారు. దాంతో శనివారం నుంచే అన్నప్రసాద పంపిణీని టీటీడీ ప్రారంభించడం అభినందనీయం అన్నారు.
అంతకుముందు రుయాస్పత్రిలో ఐడీహెచ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న కరోనా పాజిటివ్ రోగుల వార్డును సందర్శించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే పాత బర్డ్ ఆస్పత్రిని కూడా పరిశీలించారు. చివరలో టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకుని జేఈవో బసంత్కుమార్తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కరోనా ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, రుయాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ రమణయ్య, ఆర్ఎంవో డాక్టర్ హరికృష్ణ, రుయా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ధనంజయరెడ్డి, హెచ్ఏ ఉమామహేశ్వర్, తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.