మేడారం పనులపై స్పెషల్ కమిటీ వేయాలి: సీతక్క
ABN , First Publish Date - 2022-02-13T00:37:34+05:30 IST
మేడారం జాతర కోసం రూ.41 కోట్లతో చేపట్టిన సివిల్ పనులపై స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ములుగు: మేడారం జాతర కోసం రూ.41 కోట్లతో చేపట్టిన సివిల్ పనులపై స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగానే బిల్లులు మంజూరు చేయాలని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మేడారంలో జరుగుతున్న పనులపై స్థానిక శాసన సభ్యురాలినైన తన అభిప్రాయం, ప్రమేయం లేకుండానే ఇష్టానుసారంగా చేపడుతున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల బడ్జెట్ బాగానే ఉన్నా పనుల కేటాయింపు, నాణ్యత అనుమానాలకు తావిస్తోందని, దీనిపై ప్రభుత్వం పునఃసమీక్షించుకొని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గట్టమ్మ దేవాలయం వద్ద సుమారు రూ.60 లక్షల పైగా పనులు పూర్తిగా నామినేటెడ్ పద్ధతిలో కొందరి చేతనే జరిపించడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోనే మేడారం పనులు జరుగుతున్న దృష్ట్యా ఆయనే పూర్తి బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు.