అనంతగిరికి స్పెషల్ బస్సు ఏర్పాటు అభినందనీయం
ABN , First Publish Date - 2022-05-18T04:18:29+05:30 IST
అనంతగిరికి స్పెషల్ బస్సు ఏర్పాటు అభినందనీయం
- వికారాబాద్ కలెక్టర్ నిఖిల
వికారాబాద్, మే 17: ప్రయాణికుల సౌకర్యార్థం తక్కువ ఖర్చుతో హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి స్పెషల్ బస్సులు నడపడానికి ఆర్టీసీ ముందుకు రావడం ప్రత్యేక అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. మంగళవారం వికారాబాద్ బస్టాండ్లో అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చేది అనంతగిరి కొండలు, కోట్పల్లి ప్రాజెక్ట్, శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం, బుగ్గ రామలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రాలన్నారు. వీటిని దర్శించుకోవడానికి జనం ఆసక్తి చూపుతారని, ముఖ్యంగా వీకెండ్స్లలో చాలామంది ఎక్కువ ఖర్చుతో అనంతగిరికి వస్తుంటారన్నారు. మరికొంత మంది ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారన్నారు. అలాంటి వారి కోసం అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీలో తక్కువ ఖర్చుతో, సురక్షిత ప్రయాణం చేయవచ్చని.. ఈ అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆర్టీసీ రంగారెడ్డి ఆర్ఎం సాల్మన్ రాజు మాట్లాడుతూ అనంతగిరి దర్శిని స్పెషల్ బస్సు ప్రతి శని, ఆదివారాలు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ లోని కేపీహెచ్బీ నుండి ప్రారంభమై అనంతగిరి కొండలకు చేరుకుంటుం దన్నారు.అనంతపద్మనాభ దర్శనం అనంతరం బుగ్గ రామేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతగిరి కొండలు వీక్షిస్తూ కోట్పల్లి ప్రాజెక్ట్ వరకు ఈ బస్సు సౌకర్యం ఉంటుందని, సాయంత్రం తిరిగి ఏడు గంటలకు మళ్లీ కేపీహెచ్బీ బస్టాండ్కు చేరుతుందన్నారు. ఇందుకోసం పెద్దలకు రూ. 300, పిల్లలకు రూ. 150 చార్జీ వసూలు చేస్తారని తెలిపారు. టూరిస్టులకు బస్సుతోపాటు భోజనం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని, కానీ ఆ ఖర్చులు టూరిస్టులే భరించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ జ్యోతి, డిపో మేనేజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.