కొనసాగనున్న స్పెషల్ బస్సు సర్వీసులు
ABN , First Publish Date - 2021-01-18T05:15:52+05:30 IST
జిల్లాలోని పలాస, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల నుంచి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను మరికొన్ని రోజుల పాటు నడిపేందుకు ప్రతిపాదించారు.
గుజరాతీపేట : జిల్లాలోని పలాస, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల నుంచి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను మరికొన్ని రోజుల పాటు నడిపేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ సర్వీసులకు అదనంగా స్పెషల్ సర్వీసులను సంక్రాంతి పండగ సందర్భంగా నడిపేందుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పండగకు జిల్లాకు చేరుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణమయ్యేందుకు వీలుగా హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంలకు స్పెషల్ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. మరికొద్ది రోజులపాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి స్పెషల్ బస్సు సర్వీసులను నడిపేందుకు నిర్ణయించినట్టు శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం జి.వరలక్ష్మి తెలిపారు. కాగా ఆదివారం పలాస డిపో నుంచి విశాఖపట్నంకు 19, శ్రీకాకుళం రెండో డిపో నుంచి విజయవాడకు 1, సోంపేట-విశాఖపట్నంల మధ్య 3, ఇచ్ఛాపురం-విశాఖపట్నంకు 1, శ్రీకాకుళం- విశాఖపట్నం మధ్య 4 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపారు. కాగా శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి విజయవాడకు 5, హైదరాబాద్కు 1, కాకినాడకు 1, విశాఖపట్నంకు 15, పాలకొండ డిపో నుంచి విజయవాడకు 4, హైదరాబాద్కు 1, విశాఖపట్నంకు 7, టెక్కలి డిపో నుంచి విశాఖపట్నంకు 16, విజయవాడకు 1 బస్సు సర్వీసు వంతున ప్రత్యేకంగా నడిపినట్టు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా ప్రయాణికుల రద్దీ ఉన్నంత వరకు స్పెషల్ సర్వీసులు నడపనున్నామని డిప్యూటీ సీటీఎం వరలక్ష్మి తెలిపారు.