ప్రత్యేక బెడ్లను కేటాయించండి
ABN , First Publish Date - 2021-05-06T06:28:15+05:30 IST
ప్రత్యేక బెడ్లను కేటాయించండి
విజయవాడ రూరల్, మే 5 : కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో ముందు వరుసలో ఉంటున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు ప్రత్యేకంగా బెడ్లను కేటాయించాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు ఘంటా రామమోహనరావును కోరారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబుకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు కీలకపాత్ర పోషిస్తున్నారని డీపీవోకు చెప్పారు. కరోనా ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారినపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు పంచాయతీరాజ్ ఉద్యోగులు మృతి చెందినట్లు డీపీవోకు తెలిపారు. ఉద్యోగులకు సకాలంలో సరైన వైద్యం అందించలేకపోవడం, వైద్య సౌకర్యం అందు బాటులో లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. డీపీవోను కలసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.