వ్యవస్థల్లో జోక్యం సరికాదు
ABN , First Publish Date - 2020-07-05T08:48:02+05:30 IST
‘దేశంలో మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఒక వ్యవస్థ విషయంలో మరొక వ్యవస్థ జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వ్యవస్థల గురించి రాజ్యాంగంలో ఎంతో
- సూచనలివ్వాలేగాని.. నిర్ణయాలు తీసుకోవడం సరికాదు
- ఒక్కరి వల్ల స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి
- ఉద్దేశపూర్వకంగా రఘురామరాజు విమర్శలు
- వైసీపీ నచ్చకపోతే రాజీనామాచేసి వెళ్లిపోవచ్చు
- స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు
శ్రీకాళహస్తి/తిరుమల, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఒక వ్యవస్థ విషయంలో మరొక వ్యవస్థ జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వ్యవస్థల గురించి రాజ్యాంగంలో ఎంతో సున్నింతగా పొందుపరిచారు. ప్రతి వ్యవస్థకూ బాధ్యతలు, అధికారాలు, హద్దులు ఏర్పరిచారు. ఒక వ్యవస్థ విషయంలో మరొక వ్యవస్థ జోక్యం చేసుకోవడంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థకు సూచనలు ఇవ్వాలే తప్ప నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల, ఒకరి కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. ఎవరి వల్ల ఎన్నికలు ఆగిపోయాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై కూడా ఉంది’ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
గత రెండురోజులుగా శ్రీవారిని దర్శించుకుంటున్న ఆయన శనివారం తలనీలాలు సమర్పించి మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ రెండు చోట్లా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ నచ్చకపోయినా, పార్టీలో ఇమడలేకపోయినా ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసి వెళ్లవచ్చు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలే తప్ప బహిరంగంగా విమర్శలు చేయడం తగదు. రఘురామకృష్ణరాజు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఒక పార్టీ టికెట్పై గెలిచి ఇలా చేయడం మంచిది కాదు. అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం’ అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై స్పందిస్తూ.. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు. తప్పుచేస్తే ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు’ అని వ్యాఖ్యానించారు.