హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో గురువారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కరోనా సంక్షోభం తలెత్తినా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశాల లాగానే ఆయా శాఖల తరుపున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్ లో అందుబాటులో ఉంచాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలన్నారు. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గణేష్ నిమజ్జనంను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినందుకు పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని స్పీకర్ అన్నారు.
గతంలోని ఏడు సమావేశాలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు హాజరయ్యారు.