స్పందనకు అదనపు సమయం : ఎస్పీ సిద్ధార్థ కౌశల్
ABN , First Publish Date - 2021-07-27T06:38:36+05:30 IST
స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని, ఇందులో భాగంగా మరోగంట సేపు ఫిర్యాదులు తీసు కుంటున్నామని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పేర్కొన్నారు.
మచిలీపట్నం టౌన్, జూలై 26 : స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని, ఇందులో భాగంగా మరోగంట సేపు ఫిర్యాదులు తీసు కుంటున్నామని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పేర్కొన్నారు. తన చాంబర్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను కూడా సిబ్బంది తీసుకుని వచ్చారు. అర్జీదా రులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 40 మంది ఫిర్యాదుదారులు వచ్చారు. ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పామని, అయితే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మధ్యాహ్నం ఒం టి గంట వరకు ఫిర్యాదులు తీసుకుంటున్నామన్నారు. కాగా, మచిలీపట్నం ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న డి.సింహాద్రిరావును ఏఆర్ ఎస్సై పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
సెల్ఫోన్ దొంగల అరెస్టు
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రూ1.58లక్షల విలువ గల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మసుంబాషా తెలిపారు. సోమవారం ఆర్పేట స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుట్టాయిపేట సెంటర్లోని గాయత్రి సెల్ఫోన్ షాపులో సెల్ఫోన్లు దొంగిలించిన బందరుకోటకు చెందిన నిందితులు కొల్లు ఈశ్వర సాయి, బలగం నరేంద్రనాథ్, తలారి భాను ప్రకాష్లను చల్లరస్తా సెంటర్లో సీఐ బీమరాజు అరెస్టు చేశారని తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు బైక్లపై వెళుతుండగా అరెస్టు చేశామన్నారు. సంచుల్లో స్మార్ట్ ఫోన్లు, కీ ప్యాడ్ ఫోన్లు 31 ఉన్నాయన్నారు. తొమ్మిది మెమరీ కార్డులు, ఈయర్ ఫోన్లు, పవర్ బ్యాంక్లతో పాటు ఒక సీపీయూ కూడా ఉందన్నారు. వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. పెడన, కృత్తివెన్ను పోలీసు స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు నమోదు చేశారన్నారు. ఎస్సై మదీనాబాషా, బి.అనూష, కానిస్టేబుల్స్ మధు, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.