పోలీస్ స్టేషన్లలో ఎస్పీ రికార్డుల పరిశీలన
ABN , First Publish Date - 2021-05-13T06:16:23+05:30 IST
కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ అధికారులను ఆదేశించారు.
జంగారెడ్డిగూడెం, మే 12: కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం పోలీస్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించే విధం గా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్, సీఐ గౌరీశంకర్, సిబ్బంది ఉన్నారు.
ద్వారకాతిరుమల: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని కరోనా వ్యాప్తి నిరోధకంలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. ద్వారకాతిరుమల పోలీసు స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకుని కర్ఫ్యూలో భాగంగా వ్యాపార సంస్థలు మూసి వేయాలన్నారు. అనవసరంగా ఎవరూ రోడ్లపై తిరగరాదని, అలా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి నిరోధకానికి సహకరించాలన్నారు. ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు, కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.