ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు

ABN , First Publish Date - 2020-07-15T09:39:51+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నందున స్వీయ నియంత్రణ పాటించాలని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు ..

ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి 

ఎస్పీ అమిత్‌ బర్దర్‌ 

 

పోలాకి, జూలై 14: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నందున స్వీయ నియంత్రణ పాటించాలని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. మంగళవారం ఆయన పోలాకి, మబగాం గ్రామాల్లో పర్యటించి కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కంటైన్మెంట్‌ నిబంధనలను పాటించాలన్నారు. వైరస్‌ లక్షణాలతో ఉన్న వ్యక్తులందరి నుంచి రక్తనమూనాలు తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది ఇటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించి తగు సూచనలివ్వాలన్నారు. పోలాకి పోలీస్‌ స్టేషన్‌ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ ఆవరణను పరిశీలించారు. కార్యక్రమంలో  సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ చిన్నంనాయుడు,  సిబ్బంది పాల్గొన్నారు. 


నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు 

పోలాకి: లాకౌడౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఆర్డీవో ఎంవీ రమణ హెచ్చరించారు. మంగళవారం ఆయన పోలాకి, మబగాం, గజపతినగరం, కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటైన్మెంట్‌ అమలులో ఉన్న వీధుల నుంచి ఎవరూ బయటకు రావద్దన్నారు. వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని కార్మికులకు ఆదేశించారు. హోటళ్లు మూసివేయాలని, విందు భోజనాలకు ఎవరూ వెళ్ల వద్దని సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణ, తహసీల్దార్‌ సింహాచలం తదితరులు ఉన్నారు.


 పాతపట్నంలో లాక్‌డౌన్‌కు ప్రతిపాదన

పాతపట్నం: పాతపట్నంలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ అమలుకు పాలకొండ ఆర్డీవోకు ప్రతిపాదనలు పంపామని ప్రత్యేకాధికారి బి.లవరాజు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా కూరగాయలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తీయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ ఎం.కాళీ ప్రసాద్‌, ఎస్‌ఐ టి.రాజేష్‌, ఎంపీడీవో పీజే ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ కె.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T09:39:51+05:30 IST