లాక్డౌన్ను ఉల్లంఘించిన మంత్రి.. ప్రభుత్వం ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2020-04-09T02:37:40+05:30 IST
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన సమాచార శాఖ మంత్రిని రెండు నెలల పాటు ప్రత్యేకమైన సెలవు ఇచ్చి పంపిస్తున్నట్లు సౌతాఫ్రికా
జొహెన్నెస్బర్గ్: దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన సమాచార శాఖ మంత్రిని రెండు నెలల పాటు ప్రత్యేకమైన సెలవు ఇచ్చి పంపిస్తున్నట్లు సౌతాఫ్రికా రాష్ట్రపతి సిరిల్ రమఫోజా ప్రకటించారు. ఈ రెండు నెలల పాటు ఆమెకు ఎటువంటి జీతం లభించదు.
సమాచార శాఖ మంత్రి స్టెల్లా డబెని అబ్రహామ్స్ లాక్డౌన్ మార్చి 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులో వచ్చిన లాక్డౌన్ని ఉల్లంఘిస్తూ.. లంచ్ చేస్తున్న ఓ ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయింది. అయితే నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువలు లేదా వైద్య అవసరాల కోసమే.. ప్రజలు బయటకు వచ్చే అనమతి ఉంది. దీన్ని ఉల్లంఘించిన 17వేల మందిని ఇప్పటికే అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
అయితే మంత్రికి సంబంధించి ఫొటో చూసిన రాష్ట్రపతి రమఫోజా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని.. ఆయన దృష్టిలో న్యాయం ముందు అందరు సమానమే అని అధికార ప్రతినిధి ఖుసెలా ఢికో తెలిపారు. అందరం దేశం కోసం పని చేస్తున్నామని.. ఈ సేవకి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు.
అయితే తను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ మంత్రి డబెని అబ్రహమ్స్ ఓ వీడియోని సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. ‘‘కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. కానీ, చాలా మంది దాన్ని ఉల్లంఘిస్తున్నారు. జరిగిన ఘటనకి నేను చాలా చింతిస్తూ.. క్షమాపణ కోరుతున్నాను’’అని ఆమె అన్నారు. అయితే జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించి మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ అలియన్స్ డిమాండ్ చేసింది. డబెని సెలవుకాలం ముగిసేవరకూ ఆమె స్థానంలో స్థానంలో జాక్సన్ థెంబూ సమాచార మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు.