కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ వన్డే సిరీస్ వాయిదా
ABN , First Publish Date - 2021-11-28T01:20:26+05:30 IST
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న మరో
కేప్టౌన్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ అందరినీ భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘ఒమిక్రాన్’ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని తేలడంతో ప్రపంచదేశాలన్నీ మళ్లీ ఆంక్షల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.
ఈ ప్రభావం క్రికెట్ సిరీస్లపైనా పడింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ ఇప్పటికే డోలాయమానంలో పడగా, తాజాగా సొంతగడ్డపై నెదర్లాండ్స్తో జరుగుతున్న వన్డే సిరీస్ను సౌతాఫ్రికా వాయిదా వేసింది.
దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కరోనా వేరియంట్ కారణంగా మిగతా రెండు వన్డేలు వాయిదా పడ్డాయి. కొత్త వేరియంట్ కారణంగా ఆందోళన చెందుతున్న ఇతర దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై యూకే, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాలు ట్రావెల్ బ్యాన్, ఆంక్షలు విధిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ సౌతాఫ్రికా పేర్కొంది.
వన్డే సిరీస్ వాయిదా పడడంతో నెదర్లాండ్స్ జట్టు హోటల్కే పరిమితమైంది. స్వదేశానికి తిరిగి వెళ్లే విమానాలు ఫైనల్ అయ్యే వరకు జట్టు సభ్యులు హోటల్లోనే గడపుతారు. మరోవైపు, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది.
డిసెంబరు 17న పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉండగా, ఇప్పుడీ టూర్పై సందిగ్ధత నెలకొంది. కాగా, ప్రియాంక్ పాంచాల్ నేతృత్వంలోని భారత ఎ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.
సౌతాఫ్రికా ఎ జట్టుతో మూడు నాలుగు రోజల అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ నెల 23న ప్రారంభమైన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నెల 29న రెండు, డిసెంబరు 6న మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా, వీటిపైనా క్రికెట్ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.