సారీ.. ‘నేస్తం’!

ABN , First Publish Date - 2022-01-09T07:24:40+05:30 IST

సారీ.. ‘నేస్తం’!

సారీ.. ‘నేస్తం’!

సొమ్ముల్లేక ‘ఈబీసీ నేస్తం’ వాయిదా

రేపు మీట నొక్కాలనుకున్న జగన్‌

నంద్యాలలో భారీ సభకూ ఏర్పాట్లు

కానీ... చేతిలో కాసులు లేక కటకట

నేడు ఢిల్లీకి మంత్రి బుగ్గన, అధికారులు

వారంలోనే మళ్లీ అప్పుకోసం విన్నపాలు

కేంద్రం కరుణిస్తే మంగళవారం నిధులు

లేదంటే ఈబీసీ నేస్తం మరింత ఆలస్యం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సర్కారు వారి ‘ఈబీసీ నేస్తం’ పథకానికి కాసుల కటకట ఎదురైంది. సోమవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్భాటంగా ప్రారంభించాలని భావించినప్పటికీ... వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. చేతిలో సొమ్ములు లేకపోవడమే దీనికి కారణం. ‘ఈబీసీ నేస్తం’ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన... 45 సంవత్సరాలు దాటిన ఓసీ మహిళలకు (కాపులు మినహా) ఏటా రూ.15వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత సోమవారం సీఎం జగన్‌ ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసి అప్పుల అనుమతి కోసం విజ్ఞప్తి చేసుకోగా... రాత్రికి రాత్రే రూ.2500 కోట్ల అప్పు పుట్టింది. వచ్చింది వచ్చినట్లుగా ఆ మొత్తాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశారు. సీఎం అప్పటికే విన్నపాలు చేసుకున్నందున... అప్పులు ఈజీగా పుడతాయని, ‘ఈబీసీ నేస్తం’ అమలు చేయవచ్చునని భావించారు. ఆర్థిక మంత్రి, సెక్రటరీలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ నెల 10న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో భారీ సభను ఏర్పాటు చేశారు. కానీ... ప్రభుత్వం అనుకున్నట్లుగా కొత్త అప్పు పుట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో, అనుకున్న సమయానికి అప్పు కూడా అందకపోవడంతో ఈబీసీ నేస్తం పథకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.


మళ్లీ అప్పుల యాత్ర... 

కొత్త అప్పులకు అనుమతిచ్చిన వారానికే మళ్లీ మరింత అప్పు కోసం ఢిల్లీ యాత్రలు మొదలుపెడుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కలిసి అప్పుల కోసం విన్నపాలు చేసుకోనున్నారు. కేంద్రం కరుణించి అనుమతిస్తే... మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని, రుణం తెచ్చుకుంటారు. ఆ మొత్తంతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, గురువారం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ.1430 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తారని అంతా భావించారు. కానీ, వాటిని ప్రభుత్వం వేరే అవసరాలకు వాడడంతో ఈబీసీ నేస్తం పథకానికి డబ్బుల్లేకుండా పోయాయి. ఇప్పుడు మంత్రి, సెక్రటరీల ఢిల్లీ యాత్ర ఫలించి అప్పులకు అనుమతి వస్తేనే ఈబీసీ పథకం ఉంటుందని... లేదంటే వాయిదా కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

Updated Date - 2022-01-09T07:24:40+05:30 IST