ఫోన్లో మాట్లాడితే ప్రేమిస్తోందని...గొంతు కోశాడు..!

ABN , First Publish Date - 2022-04-23T06:43:51+05:30 IST

అతడో జులాయి. యువతి చనువుగా ఫోన్లో మాట్లాడితే దాన్నే

ఫోన్లో మాట్లాడితే ప్రేమిస్తోందని...గొంతు కోశాడు..!

  • గొంతు కోసిన ప్రేమ!
  • హనుమకొండలో యువతిపై ప్రేమోన్మాది దాడి 
  • ఫోన్లో మాట్లాడితే ప్రేమిస్తోందని జులాయి ఊహ
  • ప్రపోజ్‌ చేస్తే దూరం పెడుతోందని ఆగ్రహం 
  • ఇంట్లోకి దూసుకొచ్చి కత్తితో గొంతు కోసి పరార్‌ 
  • ఐసీయూలో బాధితురాలు.. నిందితుడి అరెస్ట్‌
  • నిందితుడిని శిక్షించాలి.. గవర్నర్‌ ఆగ్రహం
  • బాధితురాలికి మెరుగైన వైద్యానికి ఆదేశం


నయీంనగర్‌(హనుమకొండ), హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22: (ఆంధ్రజ్యోతి): అతడో జులాయి. యువతి చనువుగా ఫోన్లో మాట్లాడితే దాన్నే ప్రేమగా ఊహించుకున్నాడు. ఒకానొక రోజు ప్రేమిస్తున్నానంటూ మేసేజ్‌ ద్వారా ప్రపోజ్‌ చేస్తే.. అప్పటి నుంచి అతడిని ఆమె దూరం పెట్టింది. దీంతో అతడు ఉన్మాదంతో రగిలిపోయాడు. పథకం ప్రకారం యువతి ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోశాడు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈ దారుణం జరిగింది. తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సుబేదారి సీఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన కుటుంబం 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కరీంనగర్‌ వెళ్లింది. ఆయన కుమార్తె(23) ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆ కుటుంబం, హనుమకొండకు మకాం మార్చింది. గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తండ్రి వెల్డింగ్‌ షాపులో పనిచేస్తుండగా, తల్లి కూలీ పనిచేస్తోంది. యువతి ఎంసీఏ చేస్తూనే పోటీపరీక్షల కోసం హైదరాబాద్‌లో ఉంటూ ఓ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది.


వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన మహ్మద్‌ అజహర్‌(24) ఐటీఐ పూర్తి చేసి, రెండేళ్లుగా జులాయిగా తిరుగుతున్నాడు. ఏడాదిక్రితం మొండ్రాయిలో ఓ పెళ్లిలో యువతిని చూసి పరిచయం చేసుకున్నాడు. అతడిది తమ అమ్మమ్మ ఊరే కావడంతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేది. యువతితో ఈ పరిచయాన్ని అజహర్‌ ప్రేమగా ఊహించుకున్నాడు. ఫోన్‌ చేయడంతో పాటు ప్రేమిస్తున్నానంటూ మెసేజ్‌లూ పెట్టేవాడు. దీంతో ఆమె అజహర్‌ను దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేని అజహర్‌ ఫోన్‌ చేసి ఆమెను వేధించసాగాడు. తాను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, మెసెజ్‌లు పెట్టి, ఫోన్‌ చేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె ప్రాధేయపడింది. దీంతో అతడు యువతిపై కక్ష పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం హైదరాబాద్‌ నుంచి యువతి ఇంటికి తిరిగొచ్చింది. ఇది తెలిసి.. పథకం ప్రకారం జేబులో కత్తి పెట్టుకొని శుక్రవారం ఉదయం 10 గంటలకు  యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎందుకొచ్చావంటూ నిలదీసిన ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారొచ్చారు. 108లో ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.


బాధితురాలిని 48 గంటల అబ్జర్వేషన్‌లో పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో ఆక్సిజన్‌ అమర్చామని వెల్లడించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు ప్రత్యేక బృందాలతో వేట మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారమే నిందితుడిని అరెస్టు చేశారు. 



కఠిన శిక్ష పడేలా చూడాలి: తమిళిసై 

హనుమకొండలో యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆమె ఫోన్‌ చేసి.. యువతి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


Updated Date - 2022-04-23T06:43:51+05:30 IST