సోనుసూద్‌కు ముంబై మున్సిపాలిటీ మరో నోటీసు

ABN , First Publish Date - 2021-12-06T16:30:05+05:30 IST

ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరో నోటీసు జారీ చేసింది....

సోనుసూద్‌కు ముంబై మున్సిపాలిటీ మరో నోటీసు

ముంబై : ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరో నోటీసు జారీ చేసింది.సోనూసూద్‌ తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని, దాన్ని తిరిగి నివాస భవనంగా పునరుద్ధరించాలని బీఎంసీ జారీ చేసిన నోటీసులో కోరింది. నవంబర్ 15న నోటీసు జారీ చేశారు. నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చారని ఆరోపించారు.ఈ ఏడాది ప్రారంభంలో సోనుసూద్‌ను బాంబే హైకోర్టు విచారించింది.దీంతో సోనుసూద్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనధికార హోటల్‌ను మార్చి తిరిగి నివాస ప్రాంగణంగా పునరుద్ధరించడానికి అతను అంగీకరించారు.


గతంలో సోనూ సూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది.‘‘మీ భవనంలోని 1 నుంచి 6వ అంతస్థులలో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం నివాస అవసరాలకు ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు.పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు’’ అని బీఎంసీ నోటీసులో పేర్కొంది. బీఎంసీ కార్యాలయం అక్టోబర్ 20న స్థలాన్ని పరిశీలించగా  ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇంకా పనిని పునరుద్ధరించలేదని గమనించామని బీఎంసీ నోటీసులో తెలిపింది. హోటల్ ను  నివాస భవనంగా మార్చాలని బీఎంసీ నోటీసులో సోనుసూద్ ను కోరింది.

Updated Date - 2021-12-06T16:30:05+05:30 IST