సొంత ఫోన్‌లో సెల్ఫీ తీయలేము

ABN , First Publish Date - 2022-08-18T06:29:26+05:30 IST

‘‘ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాల అప్‌లోడ్‌కు విద్యా శాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ (ఫేషియల్‌ స్కానింగ్‌ కోసం సెల్ఫీ)ను మా సొంత ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం తెలుపుతున్నాం.

సొంత ఫోన్‌లో సెల్ఫీ తీయలేము
అచ్యుతాపురం ఎంఆర్‌సీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న ఫ్యాప్టో నాయకులు

హెచ్‌ఎంలకు టీచర్లు స్పష్టీకరణ

పనిచేయని యాప్‌

పదిశాతం లోపే హాజరు

రెండురోజులగా పనిచేయని విద్యార్థి హాజరు యాప్‌

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

‘‘ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాల అప్‌లోడ్‌కు విద్యా శాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ (ఫేషియల్‌ స్కానింగ్‌ కోసం సెల్ఫీ)ను మా సొంత ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం తెలుపుతున్నాం. యాప్‌ డౌన్‌లోడ్‌ వల్ల ఫోన్‌లో మా వ్యక్తిగత డేటాకు భద్రత ఉండదు. సొంత ఫోన్‌లలో కొత్త యాప్‌ డౌన్‌లోడ్‌కు మా అశక్తతను తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తే దాని నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వేస్తాము. ఇంకా మిగిలిన వివరాల అప్‌లోడింగ్‌ బాధ్యత నుంచి మమ్మల్ని తప్పించాలని కోరుతున్నాం...’’

- ఇదీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం సమర్పించిన వినతిపత్రం సారాంశం.


సెల్ఫీ (ఫేషియల్‌ స్కానింగ్‌) హాజరుకు రెండో రోజు కూడా మెజారిటీ ఉపాధ్యాయులు ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో బుధవారం పది శాతం కంటే తక్కువ మంది హాజరు వేసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయగా...మిగిలినవారు దూరంగా ఉన్నారు. ఇదిలావుండగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ గ్రూపుల్లో యాప్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా తమ తమ ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందజేశారు. యాప్‌ డౌన్‌లోడ్‌, సెల్ఫీ హాజరుకు ప్రభుత్వం సెల్‌ ఫోన్లు సరఫరా చేస్తే తప్ప సొంత ఫోన్‌లను వినియోగించలేమని హెచ్‌ఎంలకు ఇచ్చిన వినతిపత్రాల్లో టీచర్లు స్పష్టంచేశారు. ఇప్పటికే పలురకాల యాప్‌ల వినియోగం వల్ల భారం పెరిగిందని, సర్వర్లు పనిచేయక రోజుంతా వాటితో కుస్తీ పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికితోడు సొంత ఫోన్‌లలో వున్న వ్యక్తిగత డేటాకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలో పది శాతం కంటే తక్కువగా టీచర్లు సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేసినట్టు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. నెట్‌వర్క్‌ లేని ఏజెన్సీ మండలాల్లో మూడు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే సెల్ఫీలు తీసుకుని అప్‌లోడ్‌ చేశారని వివరిస్తున్నారు. కాగా ప్రతి టీచర్‌ తప్పనిసరిగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాల్సిన బాధ్యతను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ అప్పగించింది. హెచ్‌ఎంలకు కూడా ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యా శాఖ ఆదేశాల మేరకు టీచర్ల సెల్‌ఫోన్‌లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి రిజిస్టర్‌ చేయించారని అనకాపల్లి ప్రాంతానికి చెందిన టీచర్‌ ఒకరు పేర్కొన్నారు. అయితే హాజరు విషయంలో మాత్రం హెచ్‌ఎంలు పట్టుబట్టడం లేదన్నారు. దీనికితోడు బుధవారం కొద్దిసేపు మాత్రమే సెల్ఫీ యాప్‌ పనిచేసింది. ఆ తరువాత మొరాయించింది. కొన్నిచోట్ల అసలు ఓపెన్‌ కాలేదు. కాగా టీచర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడంతో విద్యా శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకపక్క ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు యాప్‌ డౌన్‌లోడ్‌, సెల్ఫీ హాజరుపై వివరాలు కోరుతుండగా...క్షేత్రస్థాయిలో టీచర్లు విముఖత చూపుతుండడంతో ఏం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా ఇప్పటివరకు విద్యార్థుల హాజరుకు ఒక యాప్‌ ఉండేది. ప్రతిరోజు మొదటి పీరియడ్‌లో టీచర్‌ తరగతి గదిలో విద్యార్థుల హాజరుతీసుకుని సెల్‌ఫోన్‌ ద్వారా ఆ యాప్‌కు అప్‌లోడ్‌ చేసేవారు. ఒక్కొక్కసారి రెండు, మూడు గంటల సమయం తరువాతే అప్‌లోడ్‌ జరిగేది. రెండు రోజుల నుంచి విద్యార్థుల అటెండెన్స్‌ యాప్‌ కూడా పనిచేయడం లేదు. దీంతో విద్యార్థుల హాజరును మాన్యువల్‌గా హాజరు పట్టికలో నమోదుచేస్తున్నారు. 

  రెండవ రోజూ 8 మంది హాజరు నమోదు        

మాకవరపాలెం, ఆగస్టు 17: మండలంలో బుధవారం ఎనిమిది మంది ఉపాధ్యాయులు హాజరు మాత్రమే నమోదు అయినట్టు మండల విద్యా శాఖ కార్యాలయం సిబ్బంది తెలిపారు. మండలంలో మొత్తం 54 ప్రభుత్వ పాఠశాలల్లో 112 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మంగళవారం నుంచి అమలులోకి తెచ్చిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) యాప్‌ సరిగా  ఓపెన్‌ కాకపోవడంతో తొలిరోజు ముగ్గురు ఉపాధ్యాయుల హాజరు మాత్రమే నమోదైంది. 

అచ్యుతాపురంలో ఫ్యాప్టో నిరసన

అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 17: హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బుధవారం మండల రీసోర్సు భవనం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రోజూ ఉదయం తొమ్మిది గంటల లోపు ముఖ హాజరు నమోదు చేసుకోకపోతే ఆ రోజు సెలవు కింద పరిగణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మెనూ వివరాలు, మరుగుదొడ్ల క్లీనింగ్‌, విద్యార్థుల మార్కులు, విద్యా కానుక కిట్లు పంపిణీ, తదితర వివరాలను పలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల విద్యాబోధన కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో ఆయా సమాచారాన్ని సకాలంలో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నామని అన్నారు. ఇప్పుడు సొంత ఫోన్లలో హాజరు యాప్‌ను డౌన్‌లోడు చేసుకుని, రోజూ ఉదయం 9 గంటలలోపు ముఖ హాజరును అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. కాగా మండలంలోని కాజీపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయులు ముఖ హాజరు వేయబోమని ప్రధానోపాధ్యాయునికి లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జి.మధు, వి.శ్రీలక్ష్మి, బి.శంకరావు, పి.నాగేశ్వరరావు, ఎం.నానాజీ, జి.సూర్యప్రకాష్‌, బి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:29:26+05:30 IST