ఛీ.. ఛీ.. వీళ్లసలు మనుషులేనా?.. పదేళ్లుగా తల్లిని గదిలో బంధించిన కొడుకులు.. వారానికి ఒకసారి ఆహారం.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-16T19:04:08+05:30 IST

నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లి పట్ల ఆ కొడుకులు దారుణంగా ప్రవర్తించారు.

ఛీ.. ఛీ.. వీళ్లసలు మనుషులేనా?.. పదేళ్లుగా తల్లిని గదిలో బంధించిన కొడుకులు.. వారానికి ఒకసారి ఆహారం.. చివరకు..

నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లి పట్ల ఆ కొడుకులు దారుణంగా ప్రవర్తించారు. బతికుండగానే ఆమెకు నరకం చూపించారు. తమ దారి తాము చూసుకుని తల్లిని గదిలో బంధించేశారు. పదేళ్ల పాటు ఆమె ఒంటరిగా ఇంట్లోనే పడి ఉంది. ఆమెకు కొడుకులు వారానికి ఒకసారి మాత్రమే ఆహారం అందించేవారు. మిగతా రోజుల్లో పక్కింటి వారు ఆహారం ఇస్తే ఆమె తినేది. లేదంటే లేదు. తాజాగా ఆమెను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు కాపాడారు. తమిళనాడులోని తంజవూరులో ఈ ఘటన జరిగింది. 


బాధితురాలి పేరు జ్ఞాన జ్యోతి. వయసు 72 సంవత్సరాలు. ఈమె భర్త దూరదర్శన్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. 2010లో ఆయన మరణించారు. భర్త మరణం తర్వాత జ్ఞాన జ్యోతి బాధ్యతను కూతురు తీసుకుంది. అయితే ఆ కూతురు మరో రెండేళ్లకు ఓ ప్రమాదంలో మరణించింది. అండగా ఉండాల్సిన కొడుకులు షణ్ముగ సుందరం, వెంకటేశన్ తల్లి బాధ్యతలు తీసుకోలేదు. ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేశారు. ఇంటి గేటు, తలుపులన్నింటినీ లాక్ చేశారు. వారానికి ఒకసారి షణ్ముగ సుందరం భోజనం, మంచినీళ్లు ఇచ్చేవాడు. మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు పక్కింటి వారు భోజనం పెడుతుండేవారు. 


ఆమెకు వచ్చే పెన్షన్‌ను మాత్రం కొడుకులు తీసుకునేవారు. తల్లి సంరక్షణను గాలికి వదిలేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేశారు. వారు వెళ్లటప్పటికి జ్ఞానజ్యోతి గదిలో నగ్నంగా పడుక్కుని ఉంది. చాలా బలహీనంగా కనిపించింది. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ప్రతినిధులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ఇద్దరు కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.   

Updated Date - 2022-04-16T19:04:08+05:30 IST