National Herald case : ముగిసిన సోనియా విచారణ.. తొలుత భోజన విరామం అని చెప్పి.. ఆ తర్వాత ముగిసిందన్నారు..
ABN , First Publish Date - 2022-07-27T20:47:04+05:30 IST
నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) విచారణ ముగిసింది.
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) విచారణ ముగిసింది. బుధవారం 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం(ED Office) నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అధికారులు సోనియాకు భోజన విరామం ఇచ్చారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణకు(Investigation) రావాలని తొలుత సమాచారం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి తర్వాత విచారణ ముగిసిందని సమాచారం చేరవేశారు. తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పారని సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి సోనియా విచారణ ముగిసినట్టే భావిస్తున్నారు. ఇప్పటికే 3 రోజులపాటు సోనియాను అధికారులు ప్రశ్నించారు. మూడు రోజుల్లో మొత్తం 12 గంటలపాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈనెల 21న 3 గంటలు, నిన్న (మంగళవారం) రెండు దఫాలుగా 6 గంటల పాటు ప్రశ్నావళి కురిపించారు. ఇక బుధవారం(ఈరోజు) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
మంగళవారం 6 గంటలపాటు విచారణ
‘నేషనల్ హెరాల్డ్’ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ అధికారులు మంగళవారం ఏకంగా 6 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు విడతల్లో ఆమె ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ స్టేట్మెంట్ను ఈడీ నమోదుచేసింది. కాగా.. నేషనల్ హెరాల్డ్ పత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారాల్లో ఆమె పాత్రపై అధికారులు ఆరాతీశారు. ఆయా సంస్థల్లో రాహుల్ గాంధీ పాత్ర గురించి కూడా సోనియాను ప్రశ్నించారు. ఈడీకి గతంలో రాహుల్ ఇచ్చిన సమాచారంతో సోనియా స్టేట్మెంట్ను పోల్చి చూడనున్నట్టు ఈడీ అధికారి తెలిపారు.