సోనియాకు మళ్లీ కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-08-14T08:38:28+05:30 IST
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారినడ్డారు. శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని..
మల్లిఖార్జున ఖర్గే, ఫరూఖ్ అబ్దుల్లాకి కూడా
పంజాబ్లో మాస్కు ధారణ తప్పనిసరి
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారినడ్డారు. శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్నారని పేర్కొన్నారు. కాగా, సోనియా కరోనా పాజిటివ్గా తేలడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. జూన్ నెలలో కరోనా రావడం, దానికి సంబంధించిన సమస్యలతో సర్ గంగారాం ఆస్పత్రిలో చేరి ఆమె వైద్యసాయం పొందారు. మరోపక్క, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అఽధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కూడా కరోనా బారిన పడ్డారు.
కరోనా పాజిటివ్గా తేలడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తాను దూరంగా ఉంటానని పేర్కొంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఖర్గే శనివారం లేఖ రాశారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, అభిషేక్ మనుసంఘ్వీ, పవన్ ఖేరా తదితరులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాగా, తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం మాస్కు ధారణను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు అన్ని చోట్ల ప్రజలు మాస్కులు ధరించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.